Reading Time: 2 minutes
పచ్చి గడ్డితో నడిచే వినూత్న బైక్.. బ్రేకులేని ఈ బండికి హెల్మెట్‌అవసరమే ఉండదు..!

రామ్ ప్రసాద్ గోయెంకా గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్వదేశీ జుగాడ్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన ఉదాహరణను పోస్ట్ చేశారు. 8 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక గాడిద పూర్తిగా మోటార్‌సైకిల్‌గా మారిపోయి ఉంది. దాని ఫీచర్లను వివరిస్తూ, గోయెంకా సరదాగా ఇలా రాశారు, దీన్ని తప్పకుండా కొనాలి. ఇది గడ్డి మీద నడుస్తుంది.. ఛార్జింగ్ అవసరం లేదు, దీనికి ఆటోమేటిక్ హెడ్‌లైట్లు ఉన్నాయి..

గాడిదకు బైక్ రూపురేఖలు!:

పాకిస్థాన్‌కు చెందినదిగా భావిస్తున్న ఈ ఎనిమిది సెకన్ల వింత వీడియోలో, ఒక గాడిదను వినూత్నంగా మోటార్ బైక్‌లా మార్చడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గాడిద వీపుపై బైక్‌కి ఉండే సౌకర్యవంతమైన సీటును బెల్టుతో కట్టి అమర్చారు. అంతేకాకుండా, దాని తల, చెవుల భాగంలో వెలిగే హెడ్‌లైట్, సిగ్నల్ లైట్లను బిగించారు. దీనిని చూసిన వారెవరైనా సరే నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

హర్ష్ గోయెంకా సరదా క్యాప్షన్:

ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న హర్ష్ గోయెంకా, దానికి సరదాగా ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. దయచేసి దీనిని కొనుగోలు చేయండి. ఇది పూర్తి ఉచితంగా లభించే పచ్చగడ్డితో నడుస్తుంది. దీనికి ఎలాంటి ఛార్జింగ్ సమయం లేదా పెట్రోల్ అవసరం లేదు. పైగా ఇందులో ఆటోమేటిక్ హెడ్‌లైట్లు కూడా ఉన్నాయి అని ఆయన రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల వింత స్పందనలు:

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇది అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఇకో ఫ్రెండ్లీ వాహనమని పలువురు సరదాగా వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ నుండి గ్రాస్ వెహికల్ వైపు మారుతున్న భవిష్యత్తు సాంకేతికత అని కామెంట్ చేశారు.

మరొకరు దీనికి ఎలాంటి CEAT టైర్ల అవసరం లేదు, పైగా ఇది సహజ సిద్ధమైన ఎరువును బై-ప్రొడక్ట్‌గా అందిస్తుంది అని సరదాగా రాశారు. మరికొందరు మాత్రం, ఆ మూగజీవిపై ఇలాంటి ప్రయోగాలు చేయడం పట్ల కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆ వింత దృశ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని, ఎటువంటి ఇంధనం అవసరం లేని ఈ గాడిద బైక్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..