Reading Time: 3 minutes
గల్లి గల్లీకో చరిత్ర.. రాతిగుట్టలపై రాచనగరం! ఇక్కడ అడుగుపెడితే ఇలాంటి వింతలు ఎన్నో!

ఆ ప్రాంతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు.. కాలగర్భంలో చెక్కిన ఒక జ్ఞాపకగాథ..! సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్‌ పీఠభూమి రాతి గుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో.. ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది. అక్కడ అడుగు అడుగుకో చరిత్ర.. గుట్ట గుట్టకో కథ. వీధివీధికో ప్రాముఖ్యత. ఏడు వారాలతో వెలిసిన ప్రాంతం.. కాకతీయుల నుండి వెలమ ప్రభువుల దాక.. స్వరాష్ట్ర ఏర్పాటుతో జిల్లా కేంద్రంగా ఎదిగిన పట్టణం. అదే నిర్మల్ జిల్లా.. తరగని చరిత్రకు.. నాగరికత, పలికిన సంస్కృతి, సంప్రదాయాలకు కేరాప్..!

సోమవారం.. మంగళవారం.. బుధవారం.. ఇలా ఏడు వారాలు.. ఏడు వీధులు.. ఇది నిర్మల్ పట్టణానికి మాత్రమే సొంతమైన ఘనత. వాడల పేర్లంటే వ్యక్తుల పేరో, ప్రముఖుల పేరో. రాజుల పేరు. విజయాలకు చిహ్నంగా నిలిచిన పేర్లో ఉండటం సహజం. కానీ నిర్మల్ మాత్రం వారాల పేర్లతో వీధులు దర్శనమిస్తాయి. అవే నిర్మల్ చరిత్రను గుర్తు చేసే వీధులు. సోమవారం పేరుతో సోమవార్‌పేట్, మంగళవారం పేరుతో మంగళ్‌పేట్ (ప్రస్తుత బంగల్‌పేట్), బుధవారం పేరుతో బుధవార్‌పేట్, గురువారం పేరుతో బేస్తవార్‌పేట్, శుక్రవారం పేరుతో జుమ్మెరాత్‌పేట్, శనివారం పేరుతో బాలాజీవాడ, ఆదివారం పేరుతో రవి నగర్.. ఇలా ఏడివారాల పట్టణంగా 400 ఏళ్ల క్రితం ఏర్పడింది నిర్మల్.

కాలం మారినా.. పేర్లు మారినా.. ఈ వీధులు నాటి చరిత్రను నేటికీ గుర్తు చేస్తున్నాయి. నిమ్మ నాయుడు కాలంలో ‘కసుబ’ ప్రాంతంగా ఉన్న నిర్మల్‌.. కాలక్రమంలో విస్తరించి రాచనగరంగా రూపుదిద్దుకున్నట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. పట్టణం విస్తరించే క్రమంలో పాలకులు కొత్త వీధులకు వారాల పేర్లను పెట్టినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది.

చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు

కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మల్‌లో ‘నకరములు’ అనే వాణిజ్య కేంద్రం ఉండేది. దానికి గుర్తుగా ఉన్న నకరేశ్వరవాడ.. కాలక్రమంలో నగరేశ్వరవాడగా మారింది. కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించిన శివాలయం ఇప్పటికీ నగరేశ్వరవాడలో కనిపిస్తుంది. కాకతీయుల కాలం నాటి ఓంకారేశ్వరాలయం ఖజానా చెరువు సమీపంలో ఉంది. పద్మనాయక వంశానికి చెందిన శ్రీనివాసరావు నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయం, పద్మాక్షి ఆలయం దేవరకోట ప్రాంతంలో ఉన్నాయి. నిర్మల్‌ గుట్టలపై అనేక ప్రాంతాల్లో ఉమామహేశ్వర విగ్రహాలు, వీరగల్లులు కనిపించడం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది.

రాతిగుట్టలపై రాచనగరం..

అనేక రాతిగుట్టలతో కూడుకున్న నిర్మల్‌ పట్టణాన్ని ఆయా రాజవంశాల పాలకులు తమ పరిపాలనా కేంద్రాలుగా మలుచుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇతర గ్రామాల నుంచి పట్టణంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధాన ద్వారాలను బలమైన రాళ్లతో నిర్మించారు. ఉత్తర – దక్షిణ దిశల్లో రాకపోకలకు గొలుసుల దర్వాజా అతిపెద్ద ద్వారంగా ఉండేది. పట్టణం మధ్యలో ఉన్న పాలపిట్ట దర్వాజా అంతర్గత రాకపోకలకు ఉపయోగించేవారు. సుమారు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో రాచనగరాన్ని అద్భుతమైన నిర్మాణ కౌశలంతో తీర్చిదిద్దారు. గోదావరి పరిక్రమణలో భాగంగా శ్రీరాముడు గండి రామన్న క్షేత్రంలో కొంతకాలం నివసించినట్లు పురాణ కథనం. రాముడికి ఇక్కడి సహ్యాద్రి పర్వతాలే ఆశ్రయం ఇచ్చాయని స్థానికుల విశ్వాసం.

ఖిల్లాగుట్ట.. రాజవంశాల ఆనవాళ్లు

నిర్మల్‌ నడిబొడ్డున ఉన్న ఖిల్లాగుట్ట సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గుట్టపై రాణివాస గదులు, రాజు పరిపాలన నిర్వహించే సభామండపం ఉండేవి. లలిత కళల ప్రదర్శనకు నాట్యమందిరం, అక్కాచెల్లెళ్ల బావులు, ఆలయం వంటి నిర్మాణాలు ఉన్నాయి. సైనికుల కోసం భారీ రాతి నీటి తొట్టె, ఆయుధాలను భద్రపరిచే గదులు కూడా ఉన్నాయి. రాజు, రాణి సాయంత్రం వేళ కూర్చునే సింహాసనాలు ఇప్పటికీ నాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. కోటలో రహస్య మార్గాలు ఉండటం అప్పటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారాల పేర్లతో వీధులు.. రాజవంశాల ఆనవాళ్లతో గుట్టలు.. ఆలయాలతో ఆధ్యాత్మిక చరిత్ర.. ఇలా అడుగడుగునా గత వైభవాన్ని గుర్తు చేసే నగరమే నిర్మల్‌.

ఎత్తు పల్లాలతో కూడిన రాతి గుట్టలు

దక్కన్‌ పీఠభూమిలో సముద్రమట్టానికి సుమారు 350మీటర్ల ఎత్తులో ఉండే నిర్మల్‌ రాతిగుట్టలు ఎత్తు పల్లాలతో కూడుకుని ఉంటాయి. నిర్మల్‌ పట్టణ కేంద్రానికి గోదావరి నది కేవలం 16కి.మీ దూరంలో ఉండటం వల్ల నది ప్రవహించినంత మేర గొప్ప నాగరికత, సంస్కృతి విలసిల్లింది. షోడశ జనపదాల్లో అస్మక జనపదానికి చెందిన నిర్మల్‌… శాతవాహనుల ఏలుబడిలో ఉన్నట్లు లభించిన మట్టిపాత్రలు, కుండ పెంకులు, మట్టికోటలు, ఇటుకలు, బౌద్ధస్తూపాల వల్ల తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లాలోనే బావరీ నివసించిన బాధన్‌కుర్తి గ్రామం ఉంది. బౌద్ధం దక్షిణపథాన ఇక్కడినుంచే మొదలైంది. మహిషకులు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయక వంశస్తులు, కుతుబ్‌షాహీలు, నిజాం వంశస్తులు… అదేవిధంగా స్థానిక ఖిల్లాదారుల ఏలుబడిలో నిర్మల్‌ వైభవంగా వెలిగింది. పట్టణ కేంద్రంలో అనేక మతాలకు చెందిన విగ్రహాలున్నాయి.

సంస్కృతి, కళలకు శతాబ్దాల చరిత్ర!

నిర్మల్ జిల్లా సుదీర్ఘమైన సంస్కృతి, కళలు, శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతం. పూర్వం ఈ ప్రాంతం శాతవాహనులు, రాష్ట్రీయకూటులు, కాకతీయులు మరియు పద్మనాయకుల (రేచర్ల వెలమలు) పాలనలో ఉండేది. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఏలిన నిమ్మ నాయుడు అనే రాజు పేరు మీదుగా ఊరికి “నిర్మల్” అనే పేరు వచ్చింది. ఆయన హయాంలోనే ఇక్కడ కోటల నిర్మాణం మరియు కళల పోషణ ఊపందుకుంది.

జాతి అస్తిత్వానికి జీవనాడి ఈ చెక్క బొమ్మలు

14వ శతాబ్దం నుంచే స్థానిక ‘పొనికి’ చెక్కతో తయారుచేసే తేలికపాటి బొమ్మలు, కళారూపాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ‘నక్షా’ కళాకారులు వీటిని తయారుచేస్తారు. రామాయణం, మహాభారతం మరియు కాకతీయ శైలు ప్రతిబింబించే వర్ణచిత్రాలకు నిర్మల్ చిరునామాగా నిలిచింది. ఈ కళలకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. చరిత్ర పరిశోధకుడు డా.తుమ్మల దేవరావ్‌, సీనియర్ జర్నలిస్ట్ రాసం.శ్రీదర్ చెప్పిన మాటల ప్రకారం నిర్మల్ భూత భవిష్యత్ వర్తమానకాలాల ప్రవాహపు నేల.. గుట్టలు, కోటలు , చెరువులు అన్నీ ఉన్నా ఆదరణ కరువై చరిత్ర బరువైన నేల. ఈ తరం తెలుసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బంగారు చరిత్ర. నిర్మల్ ఇప్పటికి ఎప్పటికి నిర్మలమైన పట్టణం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..