Reading Time: < 1 minute
Chitties Business Fraud Five Crore Remand

Chit Fund Fraud : చిట్టీల పేరుతో దాదాపు 25 మంది నుండి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని జవహర్ నగర్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం మౌలాలి హౌసింగ్ బోర్డ్ నివాసి నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ చిట్టిల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాకేత్ లో నివసించే ఏ.వెంకటేశ్వర్లు అతని వద్ద పది లక్షల రూపాయల చిట్టి వేశాడు. దాదాపు 25 నెలలు క్రమం తప్పకుండా చీటీలు కట్టి, చిట్టి గడువు కూడా ముగియడంతో అతనికి రావాల్సిన రూ.20 లక్షలకు సంబంధించి చెక్కును ఇచ్చాడు. చిట్టిల వ్యాపారి నల్ల రమేష్ ఇచ్చిన సదరు చెక్కు బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది.

 

ఏళ్లు గడుస్తున్న అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు వెంకటేశ్వర్లు గత జులై నెల 7వ తేదీన జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల సంఖ్య పెరగడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కం 10వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నల్ల రమేష్ ను హాజరు పరిచారు. ఈనెల 27న న్యాయమూర్తి నిందితుడు రమేష్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. నల్ల రమేష్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.