
- రూ.500 కోట్ల విలువైన ఆయిల్ ఫెడ్ భూమిని
- రూ. 87 కోట్లకే ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర
- సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది
- సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారిపోయిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థకు చెందిన రూ. 5 వందల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్పరం చేసేందుకు ప్రభుత్వం తెరవెనుక భారీ కుంభకోణానికి తెరతీసిందని ఆరోపించారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు.
దశాబ్దాలుగా న్యాయపోరాటం చేసి దక్కించుకున్న ప్రభుత్వ ఆస్తిని.. రాత్రికి రాత్రే ప్రైవేట్పరంచేయాలని రాష్ట్ర సర్కారు ఎందుకు ఆరాటపడుతోందని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో రూ. 500 కోట్ల విలువ చేసే 15,984 గజాల భూమిని.. ప్రభుత్వం కేవలం రూ. 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. ఆయిల్ ఫెడ్ ఆధీనంలో ఉన్న 15,984 గజాల భూమిని కాదని.. ఆ సంస్థకు కేవలం 1,800 గజాలు మాత్రమే ఇచ్చి, మిగతా అత్యంత విలువైన భూమినంతా అక్రమంగా అదే ప్రైవేట్ వ్యక్తికి ఎలా ధారాదత్తం చేస్తారని నిలదీశారు. ‘‘ఇదే భూమికి సంబంధించి ఫ్రీహోల్డ్ హక్కుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన రూ. 87 కోట్లను చెల్లించడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ ఇప్పటికే ఎఫ్డీలు చేసి సిద్ధంగా ఉంది. సొంత ప్రభుత్వ సంస్థ ముందుకు వస్తే బలోపేతం చేయాల్సింది పోయి.. ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇందులో ఎంత కమీషన్ దాగుంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
కోర్టుల ఉత్తర్వులనూ కాలరాస్తున్నరు
2003లో రద్దయిన లీజును జీవో నంబర్ 366 ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం జరిగితే.. ఆ జీవోను ఎందుకు ఉపసంహరించుకోకూడదో చెప్పాలని 2015లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిందని హరీశ్ గుర్తుచేశారు. దీనిపై త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని 2022లో హైకోర్టు సైతం ఆదేశించిందన్నారు. చట్టం, న్యాయస్థానం, ప్రభుత్వ రికార్డులు అన్నీ స్పష్టంగా ఆయిల్ ఫెడ్ వైపే ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తొక్కిపెట్టి అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడామని తెలిపారు. ఇది ఒక్క ఆజామాబాద్ భూమి వ్యవహారమే కాదని.. కోకాపేట్, రాయదుర్గం, కంచ గచ్చిబౌలిలాంటి ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన భూములను వేలం, కేటాయింపుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్నదని అన్నారు. ఓవైపు సెక్షన్ 22ఏ పేరుతో సామాన్యుల ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వ ఆస్తులంటూ లాక్కుంటూ.. మరోవైపు అత్యంత విలువైన ప్రభుత్వ భూములను మాత్రం బడాబాబులకు పప్పుబెల్లాల్లా పందేరం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల కోసం భూములను కాపాడాల్సింది పోయి.. కమీషన్ల కక్కుర్తితో ఇష్టారాజ్యంగా అమ్మేస్తుంటే రేపు తెలంగాణలో ఒక బడికి, గుడికి, చివరికి శ్మశానానికి కూడా భూమి దొరకని దయనీయ పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజామాబాద్లోని రూ. 500 కోట్ల విలువైన ఆయిల్ ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రజావ్యతిరేక, అక్రమ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మోసాలపై ఉద్యమిద్దాం
సిద్దిపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నదని, ప్రభుత్వ పనితీరును నిలదీస్తూ ప్రజలకు అండగా గులాబీ దండు నిలబడుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, వెయ్యి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇందుకు నిరసనగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈ నెల 2 నుంచి వారంపాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే వారం రోజుల కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.