Reading Time: < 1 minute
Veligonda Project Ex Gratia Package Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలో భూములు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ తగిన సాయం అందించి, పూర్తిస్థాయిలో భరోసా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ ఎక్స్ గ్రేషియా అందించేలా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గెజిట్ లేదా సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాకపోయినా, అలాగే అవార్డు పాస్ కాని అర్హులైన యువతకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో 2019 కటాఫ్ డేట్ నుంచి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను కూడా అర్హులుగా గుర్తించారు. వారికి ప్రతి ఒక్కరికీ రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు ఇప్పటికే అందించిన పరిహారానికి అదనంగా మొత్తం రూ. 169 కోట్ల ఎక్స్ గ్రేషియాను విడుదల చేయనున్నారు. అలాగే.. నిర్వాసిత కుటుంబాలకు నెల రోజులకు సరిపడా రేషన్ కిట్లను కూడా అందించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7,027 నిర్వాసిత కుటుంబాలకు రూ. 905 కోట్ల విలువైన పునరావాస (R&R) ప్యాకేజీని అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఈ నిర్ణయాల వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ ఇవ్వనంతటి భరోసాను వెలిగొండ నిర్వాసితులకు ఇస్తున్నామని తెలిపారు. అర్హుల జాబితాలో చేర్చాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సుమారు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు, చివరి నిర్వాసితుడికి పరిహారం అందే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపడతామని స్పష్టం చేశారు.