
నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన విలయానికి ఎందరో జలసమాధి అయ్యారు. ఇప్పటికే 700 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయాందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సమయస్ఫూర్తి 1,643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. హిమనదం (గ్లేసియర్) కూలిపోవడంతో అకస్మాత్తుగా సంభవించిన వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించిన సమయంలో.. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడీ వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో పిల్లలంతా క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయం 9.20 గంటలకు హెచ్చరిక
నేపాల్లోని త్రిశూలీ లోయలో ఉన్న త్రిభువన్ త్రిశూలీ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడీకి బుధవారం ఉదయం 9.20 గంటలకు ఓ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. “గ్రామం మొత్తం కొట్టుకుపోయింది.. నదిలో కలిసిపోయింది. వెంటనే పరుగెత్తు” అంటూ అతడు హెచ్చరించాడు. ఆ సమయంలో పాఠశాలలో చుట్టుపక్కల కలిపి మొత్తం 1,643 మంది విద్యార్థులు ఉన్నారు. హిమనదం కూలిపోవడంతో పర్వత ప్రాంతంలోని నదుల్లో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. రాళ్లు, మంచు, బురద, భారీ శిథిలాలతో కూడిన వరద ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
47 ఏళ్ల రాజేంద్ర దవాడీ ఇంగ్లిష్ టీచర్గా కూడా పనిచేస్తున్నారు. తొలుత పాఠశాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన భావించారు. కాంక్రీట్తో నిర్మించిన మూడు అంతస్తుల భవనం నదికి సుమారు 60 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా గ్రామాన్ని తూర్పు ఒడ్డుతో కలిపే స్టీల్ బ్రిడ్జ్కు సమాన స్థాయిలో పాఠశాల ఉండటంతో సురక్షితంగానే ఉంటుందని భావించారు. అయితే ఓ విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నీటిమట్టం వేగంగా పెరుగుతోందని హెచ్చరించారు. దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన దవాడీ వెంటనే పాఠశాల గంట మోగించారు. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను బయటకు తరలించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం స్కూల్ బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి.. బస్సులను వెనక్కి తిప్పాలని సూచించారు. అయితే ఒక బస్సు డ్రైవర్ను మాత్రం ఆయన సంప్రదించలేకపోయారు. అప్పటికే ఆ బస్సు వంతెన దాటుతున్నట్లు ఆయన గమనించారు.
భయంతో పరుగులు తీసిన విద్యార్థులు
వరద ముప్పు తీవ్రంగా ఉందని విద్యార్థులు కూడా గుర్తించారు. ఓ బాలిక తీవ్ర భయాందోళనకు గురై పానిక్ అటాక్కు లోనైంది. ఆమెను మోటార్సైకిల్పై ఎత్తైన ప్రాంతానికి తరలించారు. మిగిలిన విద్యార్థులు కాలినడకన సురక్షిత ప్రాంతం వైపు పరుగులు తీశారు. ప్రిన్సిపల్ దవాడీ కూడా వారి వెంటే వెళ్లారు. చివరకు విద్యార్థులంతా ఓ బోధి చెట్టు కింద ఆశ్రయం పొందారు. కొద్దిసేపటికే ఉధృతంగా వచ్చిన వరద నీరు పాఠశాల భవనాలను పూర్తిగా కొట్టుకుపోయింది.
1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు
దవాడీ తీసుకున్న సత్వర నిర్ణయంతో పాఠశాలలోని 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడగలిగారు. బోధనా సిబ్బందిలోనూ దాదాపు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే సామాజిక చరిత్ర ఉపాధ్యాయుడు 32 ఏళ్ల సంతోష్ పరిహార్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. వరదకు ముందు నదీ తీరంలోని తన అద్దె గదికి అల్పాహారం వండుకునేందుకు వెళ్లిన ఆయన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. పాఠశాల శానిటేషన్ సిబ్బంది సుల్తాన్ లామా కూడా పాఠశాల తలుపులు మూసేందుకు తిరిగి వెళ్లడంతో వరదల్లో చిక్కుకుని మరణించారు.
‘నేను ఇంకేం చేయగలను?’
1,643 మంది విద్యార్థులను కాపాడిన రాజేంద్ర దవాడీని స్థానికులు హీరోగా అభివర్ణిస్తున్నారు. అయితే ఆయన మాత్రం తనను తాను హీరోగా భావించడం లేదు. “నేను ఇంకేం చేయగలను?” అంటూ పాఠశాల ఉన్న ప్రాంతం ఇప్పుడు బురద, శిథిలాలుగా మారిన దృశ్యాలను చూస్తూ దవాడీ ఆవేదన వ్యక్తం చేశారు.
హిమనదం కూలడంతో భారీ వరద
లాంగ్టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరంపై నుంచి భారీ మంచు, రాళ్ల భాగం విరిగిపడటంతో ఈ ఆకస్మిక వరద సంభవించినట్లు నిపుణులు తెలిపారు. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని లెండే ఖోలా నది ఎగువ ప్రాంతంలో సుమారు 1,200 మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్ల భారీ భాగం లోయలోకి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం ఏర్పడింది. కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయానికి చెందిన జియోమార్ఫాలజిస్ట్ డేనియల్ షుగర్ అంచనా ప్రకారం.. కొండపై నుంచి జారిపడిన ఈ భారీ మంచు, రాళ్ల భాగం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది లండన్లోని గ్రీన్ పార్క్ అంత విస్తీర్ణంతో సమానమని ఆయన తెలిపారు.
నేపాల్లో గతంలోనూ భారీ విషాదాలు
ఈ ప్రాంతంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2015 ఏప్రిల్లో దక్షిణాసియాలో 8,962 మందిని బలిగొన్న 7.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం కారణంగా సంభవించిన మంచుచరియలు వరద ప్రభావిత రసువా జిల్లాలోని లాంగ్టాంగ్ గ్రామాన్ని ముంచెత్తాయి. ఆ ఘటనలో గ్రామంలోని మొత్తం 300 మంది ప్రాణాలు కోల్పోయారు.