Reading Time: < 1 minute

నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంక్ లాకర్.. రూ.58 లక్షల నగదు దోపిడీ

Caption of Image.

నేపాల్‌లో వరదలు భారీవిధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందగా, సుమారు 2వేల500 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులతో పాటు 537 మంది విదేశీయులు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఇదిలా ఉండగా.. ధాడింగ్ జిల్లాలో ఓ బ్యాంకు లాకర్ వరద నీటిలో కొట్టుకుపోయి త్రిశూలి నది ఒడ్డుకు చేరింది. రసువా ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన ఈ లాకర్‌ను గల్చి రూరల్ మునిసిపాలిటీ-4లోని బెల్ఖుఖోలా దగ్గర గుర్తించారు. లాకర్ కనిపించగానే కొందరు దానిలోని నగదును తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి 29 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 92లక్షల68వేల505 నేపాలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం విలువ మన కరెన్సీలో సుమారు రూ.58 లక్షలు.

మరోవైపు వరదల తర్వాత కూడా నేపాల్‌లో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ఎగువ ప్రాంతాల్లో సరస్సులు పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.