Reading Time: < 1 minute
Telangana Government Releases 2000 Crore Employee Dues First Phase

CM Revanth Reddy : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ (JAC) నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు (శుక్రవారం) తొలి విడతగా రూ. 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈరోజు విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల మొత్తాన్ని వంద శాతం క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించారు. “ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తోంది.” ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ మరియు శరవేగ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.