Reading Time: 2 minutes
Mamata Banerjee Life Story West Bengal Election 2026 Bjp Lead Analysis

Mamata Banerjee Biography: దేశం మొత్తం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వైపు చూస్తోంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ముందంజలో ఉంది. దీదీ పాలనకు ప్రజలు ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మమతా బెనర్జీ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఓ అగ్నిపర్వతం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, దేశంలో ఎమర్జెన్సీ చీకట్లు అలుముకున్న వేళ.. కోల్‌కతాలోని కాలేజ్ స్ట్రీట్ సాక్షిగా ఒక సంచలనం నమోదైంది. గాంధేయవాది జయప్రకాష్ నారాయణ్ ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని, నూలు చీర కట్టుకున్న ఓ 20 ఏళ్ల యువతి ఏకంగా కారు బానెట్ ఎక్కి నినాదాలు చేసింది. ఆ ధైర్యమే మమతను ఈ స్థాయికి చేర్చింది. నేడు 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ, 71 ఏళ్ల వయసులో ఆమె మరోసారి తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు.

మమత రాజకీయ ప్రయాణం పూల బాట కాదు. ఆమెకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి ప్రోమిలేశ్వర్ బెనర్జీ మరణించారు. ప్రభుత్వానికి కాంట్రాక్టరుగా పనిచేసిన ఆయనకు రావాల్సిన బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో, వైద్యానికి డబ్బుల్లేక ఆయన కన్నుమూశారు. విధి ఎంత విచిత్రమైనదంటే.. ఆయన చనిపోయిన మరుసటి రోజే 60 వేల రూపాయల చెక్కు ఇంటికి వచ్చింది. “ఆ చెక్కు నా తండ్రిని తిరిగి తీసుకురాలేదు, ఆ గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉంది” అని ఆమె అంటుంటారు. ఐదుగురు తోబుట్టువుల బాధ్యత, ఇంటి వంట.. ఇవన్నీ పూర్తి చేసుకుని ఆమె కాలేజీకి వెళ్లేవారు. తన స్నేహితులు నాగరిక దుస్తుల్లో మెరిసిపోతుంటే, మమత మాత్రం సాధారణ కాటన్ చీరల్లో ఉండేవారు. అదే కాటన్ చీర తర్వాతి కాలంలో ‘బ్రాండ్ మమత’గా మారిపోయింది.

ఇక, 1970లో జోగమయ దేవి కాలేజీలో అడుగుపెట్టిన మమత, అతి చిన్న వయసులోనే ఛాత్ర పరిషద్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 29 ఏళ్ల వయసులో వామపక్ష దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని జాదవ్‌పూర్ స్థానంలో ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1991లో పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా, తన సొంత పార్టీ (కాంగ్రెస్) బెంగాల్‌లోని సీపీఎంకు లొంగిపోయిందని ఆరోపిస్తూ 1997లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను స్థాపించారు. ఆ తర్వాత వాజపేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రక్షణ ఒప్పందాల్లో అవినీతికి నిరసనగా ఎన్డీయే నుంచి బయటకు రావడం ఆమె మొండితనానికి నిదర్శనంగా చెబుతారు.

మమత అంటేనే నిరసన. 1992లో అత్యాచారానికి గురైన ఒక దివ్యాంగ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నాటి ముఖ్యమంత్రి జ్యోతిబసును కలవడానికి వెళ్లినప్పుడు, పోలీసులు ఆమెను జుట్టు పట్టుకుని బయటకు లాగేశారు. “ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సచివాలయంలో (రైటర్స్ బిల్డింగ్) అడుగుపెడతాను” అని ఆమె చేసిన శపథం 19 ఏళ్ల తర్వాత నెరవేరింది. 1993 జూలై 21న ఓటర్ ఐడీ కార్డుల కోసం ఆమె చేసిన పోరాటంలో 13 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, అందుకే టీఎంసీ ప్రతి ఏటా ఆ రోజును ‘అమరవీరుల దినోత్సవం’గా జరుపుకుంటుంది. సింగూరులో టాటా మోటార్స్ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె చేసిన 26 రోజుల నిరాహార దీక్ష దేశాన్నే కుదిపేసింది. నందిగ్రామ్‌లో 14 మంది రైతుల మరణం చివరకు 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది.

అధికారం చేపట్టిన తర్వాత..
ముఖ్యమంత్రిగా మమత శైలి విభిన్నం. మేధావి వర్గం ఆమెను విమర్శించినా, గ్రామీణ ప్రజలతో మమేకమవ్వడం, వారితో కలిసి డ్యాన్స్ చేయడం ఆమెకు భారీ ఓటు బ్యాంకును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘కన్యాశ్రీ’, ‘లక్ష్మీర్ భండార్’ వంటి పథకాలు మహిళలను ఆమెకు శాశ్వత మద్దతుదారులుగా మార్చాయి. కానీ.. ప్రస్తుతం మమత ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 15 ఏళ్ల అధికార వ్యతిరేకత (Anti-incumbency), పార్థ ఛటర్జీ వంటి నేతల అవినీతి ఆరోపణలు, ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన వంటివి ఆమె ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. వీటన్నింటికీ తోడు ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ఇప్పుడు పెను తుఫానుగా మారింది. బీజేపీ కనుసన్నల్లోనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని మమత ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఆమె వెన్నంటి ఉన్నవారే ఇప్పుడు శత్రువులుగా మారి ప్రత్యర్థి పార్టీల్లో చేరారు. ఇలా అనేక కరణాల వల్ల ఆమెకు సీఎం పీఠం దూరం కాబోతోంది!!