Reading Time: 2 minutes
10th Class Exam Evaluation 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం తేదీలు ఇవే.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహనకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు మొత్తం నెలకు పైగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేట్, ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు.

అయితే తాజాగా పాఠశాల విద్యాశాఖ పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను విడుదల చేసింది. టెన్త్‌ పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకనం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు మూడు విడుతల్లో మూల్యాంకనం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత మూల్యాంకనం ఏప్రిల్‌ 1 నుంచి 9 వరకు జరుగుతుంది. ఈ తేదీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌ పేపర్ల మూల్యాంకనం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 10 నుంచి 17 వరకు రెండో విడతలో ఫిజిక్స్‌, బయాలజీ పేపర్లను మూల్యాంకనం చేస్తారు. ఇక ఏప్రిల్‌ 18 నుంచి 23 వరకు జరిగే మూడో విడత మూల్యాంకనంలో సోషల్‌ స్టడీస్‌ పేపర్లను మూల్యాంకనం చేపట్టనున్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసిన తర్వాత నెలాఖరు నాటికి లేదంటే మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఏపీలో ఎప్పటినుంచంటే..

మరోవైపు ఏపీ పదో తగరతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రారంభం అవుతాయి. మర్చి 30వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం ఏప్రిల్ 4వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఏప్రిల్‌ 13వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ఏపీలో ఏప్రిల్ నెలాఖరు నాటికి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.