
ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 20వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టారు. ఎన్నో రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో సెప్టెంబర్ 6న ఆమె అధికారికంగా ప్రవేశించారు. రింగ్ లోపల తన పంచ్లతో ప్రత్యర్థులను భయపెట్టిన మేరీ, ఇప్పుడు రాబోయే 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో సరికొత్త సవాళ్లను ఎదుర్కోనున్నారు.
ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మేరీ కోమ్కు ఆమె ఆప్తమిత్రురాలు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నుంచి ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు అందాయి. 2014లో విడుదలైన ‘మేరీ కోమ్’ బయోపిక్లో మేరీ పాత్రను ప్రియాంక చోప్రా సమర్థవంతంగా పోషించిన సంగతి తెలిసిందే. ఆ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. బిగ్ బాస్ ప్రీమియర్ వేడుకలో ప్రియాంక మాట్లాడుతూ.. మేరీ కోమ్ ఎప్పుడూ ఉన్నట్లే సహజంగా ఉంటూ, స్వేచ్ఛగా, ఓపెన్ హార్ట్తో గేమ్ ఆడాలని కోరారు.
అంతేకాకుండా హౌస్లోని ఇతర కంటెస్టెంట్లకు ప్రియాంక ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. మేరీ ఇచ్చే నాకౌట్ పంచ్ చాలా శక్తివంతమైనదని, ఆమెతో జాగ్రత్తగా ఉండాలని సరదాగా హెచ్చరించారు. “మేరీ, మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి, మీ ప్రయాణాన్ని చూడటానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ప్రియాంక తన ప్రేమను తెలియజేశారు. ఓముంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ‘మేరీ కోమ్’ చిత్రం ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది.
సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్ బాస్ 20వ సీజన్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు జియోహాట్స్టార్లో, అలాగే రాత్రి 10:30 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారమవుతోంది. ఈ సీజన్లో మేరీ కోమ్తో పాటు ఆసిఫ్ ఖాన్, కనికా మన్, స్కౌట్ ఓపి (తన్మయ్ సింగ్), ఆమ్రపాలి దూబే, మాహి విజ్, యంగ్ డీఎస్ఏ, ఖాజీ తౌకీర్, అరిష్ఫా ఖాన్, రోహెద్ ఖాన్, ఇషా రిఖీ, గుల్లు (కుశాల్ తన్వర్) వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు. ఆటపాటలు, వివాదాలకు నిలయమైన బిగ్ బాస్ హౌస్లో ఛాంపియన్ మేరీ కోమ్ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తారో చూడటం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు.. దక్షిణ ప్రాంత భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాలంలో కూడా సెప్టెంబర్ 6న బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం అయింది.