
Sumanth Prabhas: టాలీవుడ్లో అలరిస్తున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్, ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా రెబల్ స్టార్ ప్రభాస్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఆరాధించే కథానాయకుడిని స్వయంగా కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సక్సెస్ మీట్లో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో చిరకాల స్వప్నం నెరవేరిన విషయాన్ని పంచుకున్నారు. “ప్రతి ఒక్కరికీ లైఫ్లో ఒక ఫేవరెట్ హీరో ఉంటారు. ఆరో తరగతి, ఏడో తరగతి చదువుతున్న రోజుల నుంచే నాకు ప్రభాస్ అన్న అంటే చెప్పలేనంత అభిమానం. ఆయనను చూడాలి, కలవాలి అనేది నా కల. ఆ కల నిజమయ్యే మూమెంట్ నా జీవితంలోకి వచ్చింది. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా అన్న చొరవతోనే ప్రభాస్ అన్నను కలిసే అవకాశం దక్కింది.
అంత పెద్ద సూపర్ స్టార్ ముందుకు వెళ్లి నిలబడేసరికి, ఆయనతో కాసేపు ముచ్చటిస్తుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను సొంత తమ్ముడిలా భావించి పెద్దమ్మ కొడుకులా పుష్ చేస్తూ, ఇంత పెద్ద హీరోని కలిసే భాగ్యాన్ని కల్పించిన ప్రణయ్ అన్నకు రుణపడి ఉంటాను” అంటూ సుమంత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మేము 40 మినిట్స్ ఉన్నాము ఆయనతో, క్యూబ్ లో మాతో కలిసి సినిమా చూస్తా అని ప్రామిస్ కూడా చేశారు. నా ఫ్రెండ్స్ బయట ఉన్నారు లిమిట్ దాటి లోపలికి రావద్దు అన్నారు అని చెప్తే ఆయనే బయటికి వచ్చి వార్ని ఇంట్లోకి రమ్మని చెప్పి స్నాక్స్ పెట్టీ ఫోటో ఇచ్చారు. లైవ్ చూసి చెప్తున్నాం బంగారం రా ప్రభాస్ అంటూ ఎమోషనల్ అయ్యారు.
సినిమా విజయం గురించి మాట్లాడుతూ, తెరపై తాను ఇంతలా కామెడీ పండించగలనని స్వయంగా తన స్నేహితులు కూడా ఊహించలేదని సుమంత్ అన్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు వేణుకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో పడి పడి నవ్వుతుంటే చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. ఇక క్లైమాక్స్లో దర్శకుడు అనుదీప్ ఎంట్రీతో థియేటర్లు హోరెత్తిపోయాయని, ఆయన కామెడీ టైమింగ్కు ప్రేక్షకుల నవ్వుల కేరింతల మధ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపించనంతగా థియేటర్లు ఎరప్ట్ అయ్యాయని చెప్పారు. అలాగే టీమ్లోని నటీనటులు అనంతిక, నరేంద్ర రవి, సోహన్, మణి, కాస్ట్యూమ్స్-యాక్టింగ్ చేసిన కీర్తన, ఖుషిల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు.