Reading Time: 2 minutes
Ishan Kishan Double Century Creates Duleep Trophy History After 31 Years

Ishan Kishan Double Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్ జోన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. 301 బంతుల్లో 250 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ డబుల్ సెంచరీతో ఇషాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

దులీప్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్‌లో 200 పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతేకాదు ఈస్ట్ జోన్ తరఫున 31 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా ఈ ఘనత సాధించడం ఇషాన్‌కు మరింత ప్రత్యేకంగా మారింది. దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కూడా ఇషాన్ నిలిచాడు. గతంలో ఈ ఘనతను 1987లో అన్షుమన్ గైక్వాడ్ సాధించాడు. దీంతో ఇషాన్ పేరు దులీప్ ట్రోఫీ రికార్డుల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది.

ఇషాన్ కిషన్ కంటే ముందు దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో డబుల్ సెంచరీలు సాధించిన వారిలో రామన్ లాంబా, అన్షుమన్ గైక్వాడ్, చెతేశ్వర్ పుజారా, యశస్వి జైస్వాల్ ఉన్నారు. 1987-88 సీజన్‌లో రామన్ లాంబా 320 పరుగులు చేయగా.. అన్షుమన్ గైక్వాడ్ 216 పరుగులు సాధించాడు. 2016-17 సీజన్‌లో చెతేశ్వర్ పుజారా 256 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2022-23 సీజన్‌లో యశస్వి జైస్వాల్ 209 పరుగులు చేశాడు. తాజాగా ఇషాన్ 250 రన్స్ చేసి రిటైర్డ్ హార్ట్ అయ్యాడు.

మ్యాచ్ తొలి రోజులో ఇషాన్ కిషన్ తన దూకుడును చూపించాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 385/4 స్కోరుతో నిలిచింది. అప్పటికి ఇషాన్ కిషన్ 111 పరుగులతో నాటౌట్‌గా ఉండగా.. కుమార్ కుశాగ్రా 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 26.4 ఓవర్లలోనే 144 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో రోజు కూడా ఇషాన్ అదే జోరును కొనసాగిస్తూ డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అతడి ఇన్నింగ్స్‌తో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. ఇప్పటికే 600 రన్స్ చేసింది.