Reading Time: 2 minutes
Pranay Reddy Vanga Sensational Comments On Fake Box Office Collections Romanchakam

Pranay Reddy Vanga: సినిమా రంగంలో బాక్సాఫీస్ నంబర్ల మాయాజాలంపై చాలా కాలంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా కూడా రూ. వందల కోట్ల పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడం టాలీవుడ్‌లో ఇటీవల ఓ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే, ఈ ఫేక్ కలెక్షన్ల వ్యవహారంపై ‘భద్రకాళి పిక్చర్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘రోమాంచకం’ సక్సెస్ మీట్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సినిమా బడ్జెట్, కలెక్షన్ల వాస్తవాలపై ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు. “చాలామంది తమ సినిమాల రేంజ్ పెంచుకోవడం కోసం మార్కెట్లో కలెక్షన్ నంబర్లను కావాలని ఇన్‌ఫ్లేట్ చేసి (ఓవర్‌రేట్ చేసి) చెబుతుంటారు. అలాంటి తప్పుడు పనులను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా, ఎప్పటికీ చేయను కూడా. ఉన్నదానికంటే ఎక్కువ నంబర్లు వేసి కలరింగ్ ఇస్తే, చివరకు ఆ లెక్కలు రికవర్ కాక భారీ సమస్యలు వస్తాయి. సినిమా పోతే ప్రొడక్షన్ బ్యానర్‌కు పెద్దగా నష్టం జరగకపోవచ్చు.. కానీ అసలైన దెబ్బ పడేది మాత్రం ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, దర్శకులపైనే! వారి మార్కెట్ దారుణంగా పడిపోతుంది” అంటూ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని నిర్భయంగా ఎండగట్టారు.

ప్రస్తుతం థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ‘రోమాంచకం’ సినిమా కలెక్షన్లపై ప్రణయ్ స్పష్టత ఇచ్చారు. రిలీజ్ అయిన కేవలం నాలుగున్నర రోజుల్లోనే ఈ చిత్రం రూ. 8.5 కోట్ల గ్రాస్ మార్కును దాటేసిందని తెలిపారు. తాము వెబ్‌సైట్లలో, పోస్టర్లలో అధికారికంగా అనౌన్స్ చేస్తున్న నంబర్లలో ఎలాంటి ఫేక్ లెక్కలు లేవని, ప్రతి రూపాయి పారదర్శకంగా డిస్ట్రిబ్యూటర్ల లెక్కల ప్రకారమే ఇస్తున్నామని స్పష్టం చేశారు.

తమ బ్యానర్‌లో గతంలో వచ్చిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయని, ఏ సినిమా చేసినా పనిచేసిన నటీనటులకు, దర్శకుడికి లైఫ్ ఇచ్చేలా ఉండాలనేది తమ సిద్ధాంతమని ప్రణయ్ చెప్పారు. “డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రోమాంచకం తీయలేదు. దర్శకుడు వేణు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టాన్ని గుర్తించే ఈ ప్రాజెక్ట్ చేశాం. స్క్రిప్ట్ సమయంలో అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేయడం నేటి కాలంలో ప్రొడక్షన్‌కు పెద్ద సవాల్. వేణు ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. చెన్నై ఎండల్లో మా టీమ్ పడిన కష్టానికి ఫలితం దక్కింది. క్లైమాక్స్‌లో దర్శకుడు అనుదీప్ ఇచ్చిన ఎంట్రీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది” అని చెప్పుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద పారదర్శకత లోపిస్తోందంటూ ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్లను, ఫేక్ పోస్టర్ల కల్చర్‌ను ఉద్దేశించే ఆయన ఇంత ఘాటుగా స్పందించారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.