Reading Time: < 1 minute
ఇజ్రాయెల్​పై ఇరాన్ కుట్ర.. ‘అక్టోబర్ 7’ తరహాలో మరో భీకర దాడికి ప్లాన్!

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడికి కుట్ర పన్నుతోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన విధ్వంసం కంటే పెద్ద దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తన అనుబంధ సాయుధ బలగాలు, ప్రాక్సీ గ్రూపులన్నింటినీ ఏకం చేసి “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” పేరుతో ఈ దాడులకు సిద్ధమవుతోంది. ఒకే సమయంలో అన్ని దిశల నుంచి ఇజ్రాయెల్‌ను కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.  ఈ ప్రమాదకరమైన ప్రణాళిక గురించిన వివరాలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బట్టబయలు చేశాయి.

అమెరికా మద్దతుతో ఇరాన్ దేశాధినేతల మరణానికి కారణమైన ఇజ్రాయెల్ ను  మట్టుబెడతామని గతంలో హెచ్చరించిన ఇరాన్, ఆచరణలో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. జెరూసలెం పోస్ట్ కథనం ఆ వివరాలను బయటపెట్టింది.

నాలుగు వైపుల నుంచి ముట్టడి

2023 అక్టోబర్ 7 దాడిలో సరైన సమన్వయం లేకపోవడాన్ని గమనించిన ఇరాన్… ఈసారి ఎలాంటి లోపాలకు తావులేకుండా, సరిగ్గా ఒకే నిమిషంలో అన్ని వైపుల నుంచి విరుచుకుపడేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇజ్రాయెల్‌పై ఉత్తర, దక్షిణ, తూర్పు సరిహద్దుల నుంచి ఏకకాలంలో దాడి జరిపేందుకు ఇరాన్ యత్నిస్తుంది.

కొత్త నాయకత్వంతో పొత్తు

హమాస్ నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఖలీల్ అల్-హయ్యాకు ఇరాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవాలనే లక్ష్యంతో వీరిద్దరూ ఏకమైనట్లు నిఘా వర్గాల సమాచారం. గత దాడులతో దెబ్బతిన్న ఇరాన్ తన సైనిక శక్తిని వేగంగా పునరుద్ధరించుకుంటోంది. క్షిపణులు, డ్రోన్ల తయారీని పెంచడంతో పాటు అణు సామర్థ్యాలను మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ ఐఆర్‌జీసీకి చెందిన ‘ఖుద్స్ ఫోర్స్’ టాప్ ఆఫీసర్లు, హెజ్‌బొల్లా, హూతీ కమాండర్లతో తరచూ వీడియో కాన్ఫరెన్సులు, రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్‌ను నలువైపులా దిగ్బంధించి, ఆర్థికంగా, సైనికంగా కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ టార్గెట్‌గా పెట్టుకుంది.

అప్రమత్తంగా ఇజ్రాయెల్

ప్రాక్సీ గ్రూపులతో ఇరాన్ కుట్రల నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. ఉత్తర, దక్షిణ సరిహద్దుల్లో ముప్పు పెరుగుతుండటంతో ఇజ్రాయెల్ సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి