Team India: శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీకి డబుల్ ప్రమోషన్.. జింబాబ్వే టూర్కు జట్టు ప్రకటన..

జింబాబ్వేతో జరగబోయే రాబోయే టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సరికొత్త యువ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని పరీక్షించేందుకు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ పర్యటనలో భాగంగా జూలై 23న తొలి మ్యాచ్, 25న రెండో మ్యాచ్, అలాగే 26న మూడో మ్యాచ్ జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లకూ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది. అయితే ఈ జట్టు ఎంపికలో కొన్ని నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లకు ఇది ఒక రకంగా డబుల్ ప్రమోషన్ అనే చెప్పాలి.
ఈ జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా కెప్టెన్సీ పరంగా, ఫామ్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్కు టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ పెద్ద పీట వేసింది. అతనిపై అపారమైన నమ్మకంతో మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగించడం అతనికి దక్కిన భారీ ప్రమోషనే. ఇక మరో ఆశ్చర్యకరమైన ఎంపిక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో తన అరంగేట్రంలో తక్కువ పరుగులకే పరిమితమై ఆకట్టుకోలేకపోయినప్పటికీ, సెలక్టర్లు అతనిలోని ప్రతిభను నమ్మి ఈ జింబాబ్వే టూర్కు ఎంపిక చేశారు. ఇలా శ్రేయస్, వైభవ్ ఇద్దరికీ ఈ టూర్ ఒక రకంగా డబుల్ ప్రమోషన్ అనే చెప్పాలి.
మరోవైపు, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక రకంగా చూస్తే ‘పాపం సంజూ’ అనక తప్పదు. ఎంత ప్రతిభ ఉన్నా, దేశవాళీల్లో, ఐపీఎల్లో రాణించినా అతనికి లక్ కలిసిరావడం లేదు. నిలకడగా అవకాశాలు ఇవ్వకుండా, ఇలా అప్పుడప్పుడు జట్టు నుంచి పూర్తిగా తప్పించడం అతని కెరీర్కు పెద్ద ఎదురుదెబ్బే. సంజూ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకున్నారు.
వీరితో పాటు దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన ప్రభ్సిమ్రన్ సింగ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, యశ్ థాకూర్, హర్ష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు ఈ టూర్లో ఛాన్స్ దక్కింది. కొత్త రక్తం, యువ ఉత్సాహంతో నిండిన ఈ టీమ్ ఇండియా జింబాబ్వే గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ నిరూపించుకోవడానికి, యువ ఆటగాళ్లు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ సిరీస్ ఒక సువర్ణావకాశం.