July 6, 2026

Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్‌కు తిప్పలు తప్పవు..

Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్‌కు తిప్పలు తప్పవు..
Reading Time: 2 minutes
Etela Rajender Hydraa Revanth Reddy Comments

Etela Rajender : హైదరాబాద్‌లో హైడ్రా (HYDRAA) వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడంలో ఉన్న క్లారిటీ ప్రజలకు లేదని, అమెరికా గడ్డపై నిలబడి ఆయన అబద్ధాలు చెబితేనే జనం నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దానికి పరాకాష్టగా తాను హిట్లర్ నుంచి ‘హైడ్రా’ అనే పదాన్ని తీసుకున్నానని సీఎం స్వయంగా ఒప్పుకున్నారని, దీన్నిబట్టే ఆయన నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల జాగాలిచ్చి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి మాత్రం పేదవాడి ఇళ్లను కూలగొట్టి, ఆ స్థలాలను పెద్దవాళ్లకు అంటగట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని, ఇలాంటి హిట్లర్ వారసత్వ సంస్థతో ప్రజలకు న్యాయం జరుగుతుందనుకోవడం భ్రమ అని దుయ్యబట్టారు.

హైడ్రా కమిషనర్‌పై కోర్టు ఆగ్రహం.. రంగనాథ్ తీరుపై మండిపాటు

తాను మొదట్లో ఒంటరిగా నాలుగు నెలల పాటు హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు చాలామంది ప్రశ్నించారని, కానీ ఇప్పుడు హైడ్రా నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసిందని, చివరకు న్యాయస్థానాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని పక్కనబెట్టి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనకు ఏ చట్టాలతో, కోర్టులతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శని, ఆదివారాలు చూసుకుని ఇళ్లను ధ్వంసం చేయడంపై కోర్టు సైతం తీవ్రంగా మందలించిందని.. “నీకు చట్టమంటే గౌరవం లేదా? నువ్వు చట్ట పరిధిలోకి రావా? జాగ్రత్తగా ఉండకపోతే జైల్లో పెడతాం” అని హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోవడం లేదని, ఇలాగే మున్ముందు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అస్మత్‌పేటలో ఇల్లు కూల్చివేతతో ఒక మహిళ ఏడ్చిన విధానం హైదరాబాదు బస్తీల్లో ఉన్న ప్రతి పేదవాడి ఆవేదనకు అద్దం పడుతోందని, వీరందరికీ తెలంగాణలోని పేదల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

హైడ్రా పేరుతో సాగుతున్న ఈ డ్రామాలకు, రేవంత్ రెడ్డి అహంకారానికి రాబోయే మున్సిపల్, జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాల వల్ల రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. పేదవాడి గూడును చెడగొట్టి కూల్చివేతల రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి అరాచక పాలనకు అంతం దగ్గర పడిందని, ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు.