
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాల టైమ్లైన్ చూస్తే, ఓఆర్ఆర్ పై భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేగం, నిర్లక్ష్యం, నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి.
2026 మే 1న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద పార్క్ చేసిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 25, 2026న శంషాబాద్ వద్ద హిట్ అండ్ రన్ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అదే విధంగా 2025 సెప్టెంబర్ 28న టెకీ ఒకరు వాహనాన్ని ఢీకొనడంతో మరణించిన ఘటన కూడా సంచలనం సృష్టించింది.
ఇక 2025 మార్చి 30న ఎగ్జిట్ 15 సమీపంలో బైక్పై నియంత్రణ కోల్పోయి ఓ వ్యక్తి మరణించాడు. 2025 నవంబర్ 26న పెద్ద గోల్కొండ సమీపంలో కార్ డివైడర్ను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. అలాగే 2025 నవంబర్ 23న ఫ్లైఓవర్ను పరిశీలిస్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 2024లో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15న పెద్ద గోల్కొండ వద్ద వాహనాల గుదిబండలో ఇద్దరు మృతి చెందగా, ఆగస్టు 7న శంషాబాద్ సమీపంలో ఓ వృద్ధుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 13, 2024న జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
ఇంకా 2022 ఆగస్టు 1న కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి చెందిన తనియా కాక్డే (25) శంషాబాద్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే, ఓఆర్ఆర్ పై ప్రమాదాలు పెరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోంది.నిపుణులు చెబుతున్నట్లు… ఓవర్ స్పీడ్, నిద్ర మొత్తు, డ్రైవింగ్లో నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, రోడ్డు భద్రతా చర్యల లోపం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచిస్తున్నారు.