Reading Time: < 1 minute
Rajamouli Mahesh Babu Varanasi Movie Shooting Water Tanker Issue Hmwssb

Varanasi: రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు ఊహించని బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న నీటి ఎద్దడి కారణంగా ఈ చిత్ర నిర్మాణ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నగర శివార్లలో వేసిన భారీ సెట్‌లో నీటి అడుగున తీయాల్సిన కీలక సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ అభ్యర్థించిన 150 నీటి ట్యాంకర్ల సరఫరాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) తిరస్కరించిందని సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. సినిమా షూటింగ్ కోసం భారీగా వాటర్ ట్యాంకర్లు కావాలని చిత్ర నిర్మాణ సంస్థ HMWSSBని కోరిందని, అయితే ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు దానికి అంగీకరించ లేదని టాక్.

నగరంలో ఎండల తీవ్రత పెరగడంతో నీటికి డిమాండ్ భారీగా పెరిగింది. నివాసితులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, షూటింగ్ వంటి అత్యవసరం కాని పనులకు ఇంత పెద్ద మొత్తంలో నీటిని కేటాయించలేమని అధికారులు స్పష్టం చేశారని సమాచారం. చిత్ర యూనిట్ నీటి ట్యాంకర్ల ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, బోర్డు నో చెప్పడంతో ప్లాన్ చేసిన అండర్ వాటర్ సీక్వెన్స్ షెడ్యూల్ ప్రభావితమైందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సన్నివేశాలు సినిమాలో విజువల్ వండర్‌గా ఉంటాయని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పుడు చిత్ర బృందం నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘వారణాసి’ విశేషాలు ఇవే..
ఇటీవల మెక్సికోలో జరిగిన కామిక్ కాన్ 2026లో వారణాసి సినిమా నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. గ్రహశకలం ఢీకొనడం వల్ల కలిగే వినాశనాన్ని ఆపడానికి రుద్ర (మహేష్ బాబు) చేసే ప్రపంచ పర్యటన చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా క్రీ.శ. 512 నుంచి 2027 వరకు ఉన్న కాలక్రమాన్ని అన్వేషిస్తుందన్నారు. ఇందులో 20 నిమిషాల పాటు సాగే రామాయణ ఘట్టం హైలైట్‌గా ఉండనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు (రుద్ర), ప్రియాంక చోప్రా (మందకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.