
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్పై వస్తున్న విమర్శలకు ఆ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ గట్టి సమాధానమిచ్చారు. ఐపీఎల్ మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధర పంత్ ప్రదర్శనపై ఒత్తిడి పెంచుతోందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పంత్ కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడని, అది సాధిస్తే మళ్ళీ మునుపటి జోరు అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.
పంత్ ఫామ్పై భరత్ అరుణ్ స్పందన..
గత సీజన్లో 14 మ్యాచ్ల్లో 269 పరుగులు, ప్రస్తుత సీజన్లో 8 మ్యాచ్ల్లో 189 పరుగులతో పంత్ కాస్త నెమ్మదించిన మాట వాస్తవమే. అయితే.. భరత్ అరుణ్ మాత్రం.. “ధరకి, ఆటగాడి ఫామ్కి సంబంధం లేదు. పంత్ ఇప్పటికే ఒక మ్యాచ్లో జట్టును గెలిపించాడు. అతను ఫామ్ అందుకోవడానికి ఒక్క మంచి ఇన్నింగ్స్ చాలు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న లక్నో జట్టుకు ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ‘నాకౌట్’ వంటిదేనని ఆయన స్పష్టం చేశారు.
బౌలర్ల ఫిట్నెస్పై అప్డేట్స్..
మొహ్సిన్ ఖాన్ ఎడమచేతి వాటం పేసర్ ఫిట్నెస్ కోసం కోచింగ్ స్టాఫ్ గత మూడు నెలలుగా ప్రత్యేకంగా శ్రమించిందని, దాని ఫలితమే అతని ప్రస్తుత రాణింపు అని అరుణ్ తెలిపారు. యువ సంచలనం మయాంక్ యాదవ్ ప్రస్తుతం పూర్తి ఫిట్గా ఉన్నాడని, వేగంగా బౌలింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. అయితే తుది జట్టులోకి తీసుకోవడంపై మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మహమ్మద్ షమీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, అతను జట్టులో ఎందుకు లేడని అందరూ చర్చించుకుంటున్నారని అరుణ్ ప్రశంసించారు.
మరోవైపు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంలో నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. జట్టుకు విశ్రాంతి ఉన్నప్పటికీ, రోహిత్ తన ఫిట్నెస్పై దృష్టి సారించడం విశేషం. పంత్ ఫామ్ అందుకొని లక్నోను ప్లేఆఫ్స్ రేసులోకి తెస్తాడో లేదో వేచి చూడాలి.