Reading Time: 2 minutes
Video: బాలుడికి పాము కరిచిందని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత జరిగింది మీరు ఊహించలేరు.. వీడియో వైరల్..

సాంకేతికత ఎంత పెరిగినా, మనిషి అంతరిక్షంలోకి అడుగులు వేస్తున్నా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా వేళ్లూనుకునే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన ఇందుకు నిదర్శనం. పాము కాటుకు గురైన 14 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తల్లిదండ్రులు, ఒక తాంత్రికుడి మాటలు నమ్మి నదిలో ముంచడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అమ్రోహా జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని విషసర్పం కాటు వేసింది. బాలుడి పరిస్థితి విషమించడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, ప్రాథమిక వైద్యం అందించాల్సింది పోయి ఒక తాంత్రికుడి వద్దకు హుటాహుటిన పరుగులు తీశారు. అయితే ఆ తాంత్రికుడు శాస్త్రీయ చికిత్సకు బదులుగా అత్యంత ప్రమాదకరమైన సలహా ఇచ్చాడు. బాలుడిని గంగానదిలో ముంచితే, ఆ పవిత్ర జలం ప్రభావంతో పాము విషం శరీరం నుండి బయటకు వచ్చేస్తుందని వారిని నమ్మించాడు.

12 గంటల నరకయాతన..

తాంత్రికుడి మాటలను గుడ్డిగా నమ్మిన తల్లిదండ్రులు.. బాలుడిని గంగానది తీరానికి తీసుకెళ్లారు. వెదురు కర్రలతో ఒక తాత్కాలిక తెప్ప వంటి నిర్మాణాన్ని తయారు చేసి, స్పృహలో లేని ఆ బాలుడిని దానికి కట్టేశారు. ఆ తెప్పను తాడుల సహాయంతో గంగానది ప్రవాహంలో వేలాడదీశారు. దాదాపు 12 గంటల పాటు ఆ బాలుడి శరీరం నీటిలోనే ఉంది. ఏదో అద్భుతం జరుగుతుందని, విషం విరిగిపోయి బాలుడు బతుకుతాడని చుట్టుపక్కల వందలాది మంది ప్రజలు వేచి చూశారు. కానీ చివరికి ఆ బాలుడు విగతజీవిగా మారాడు.

వైరల్ వీడియో.. నెటిజన్ల ఆగ్రహం

ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘వైద్యం అందిస్తే బతికే ప్రాణాన్ని మూఢనమ్మకంతో బలి తీసుకున్నారు’’ అని ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ తాంత్రికులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన తల్లిదండ్రులను కూడా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరణించినా నమ్మకుండా

ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్‌లో కొత్తేమీ కాదు. గత ఏడాది కూడా 20 ఏళ్ల యువకుడిని పాము కాటు వేస్తే, ఆసుపత్రిలో వైద్యులు మరణించినట్లు ధృవీకరించినా.. కుటుంబ సభ్యులు నమ్మలేదు. మృతదేహాన్ని జ్యోతిష్కుల వద్దకు తీసుకెళ్లి వారి సూచన మేరకు విషం దిగిపోతుందనే నమ్మకంతో గంగానదిలో నిమజ్జనం చేశారు. గంటల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో చివరకు అంత్యక్రియలు నిర్వహించారు.

పాము కాటు వేసినప్పుడు తొలి గంట చాలా కీలకం. ఆ సమయంలో యాంటీ స్నేక్ వెనమ్ అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఇలాంటి తాంత్రికుల మాయలో పడి ప్రాణాలను బలి తీసుకోవడం విచారకరం. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.