
MS Dhoni IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచి ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించకపోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో టాస్ వేసే సమయంలో రవిశాస్త్రి తనదైన శైలిలో రుతురాజ్ను ప్రశ్నించారు. “చాలామంది అడుగుతున్నారు.. ఇంతకీ ధోనీ ఎక్కడ?” అని అడిగారు. దీనికి రుతురాజ్ బదులిస్తూ.. “ధోనీ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆయన ప్రస్తుతం హోటల్ గదిలోనే ఉండి మమ్మల్ని చూస్తూ మద్దతు ఇస్తున్నారు. అయితే కంగారు పడకండి, చాలా త్వరలోనే ఆయనను మీరు మైదానంలో చూస్తారు” అని స్పష్టం చేశారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ధోనీ పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బాగుందని, లక్ష్యాన్ని ఛేదించడమే తమకు ఇష్టమని చెప్పాడు. ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. నితీష్ రాణా, విప్రాజ్ నిగమ్ స్థానాల్లో ఆకిబ్ నబీ, అశుతోష్ శర్మలను జట్టులోకి తీసుకుంది. గత ఏడాది కంటే తమ టీమ్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉందని, రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి బౌన్స్ బాగుంటుందని అక్షర్ ధీమా వ్యక్తం చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ కూడా తమ జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలిపాడు. డెవాల్డ్ బ్రెవిస్, గుర్జపనీత్ సింగ్ జట్టులోకి వచ్చారని పేర్కొన్నాడు. పిచ్ కొంచెం డ్రైగా ఉందని, మొదటి విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడమే తమ లక్ష్యమని చెప్పాడు. అన్నట్టుగానే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో చెన్నై ఈ సీజన్లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. మ్యాట్ హెన్రీ స్థానంలో వచ్చిన గుర్జపనీత్ సింగ్ కూడా బౌలింగ్లో ఆకట్టుకోవడం చెన్నైకి కలిసొచ్చింది.
ఈ మ్యాచ్ మరో కారణం చేత కూడా ప్రత్యేకం అయ్యింది. ధోనీ గైర్హాజరీలో సిఎస్కె తరపున ఆడుతున్న సంజు శాంసన్.. ఒకే మ్యాచ్లో సెంచరీ బాది ధోనీ పేరిట ఉన్న కొన్ని రికార్డులను తిరగరాశాడు. ధోనీ హోటల్ గదిలో నుంచే తన జట్టు గెలుపును, సంజు విధ్వంసాన్ని చూసి మురిసిపోయి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే తలా ధోనీ మైదానంలోకి దిగబోతున్నారన్న వార్త ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..