
Crime News: ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ… ఒక దాచిన పెళ్లి… చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న దారుణ హత్య. సాధారణంగా సోషల్ మీడియా పోస్టులు ఆనందాన్ని పంచుతాయి. కానీ ఈసారి అదే సోషల్ మీడియా ఓ భయంకరమైన నేరాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా జరిగిన పెళ్లి, మరో పెళ్లికి సిద్ధమైన యువతి, ఆ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త… చివరకు ఈ కథ విషాదాంతంగా ముగిసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలి పేరు భవాని. ఆమె తులసీనగర్ ప్రాంతంలో నివసిస్తూ సమీపంలోని మొబైల్ దుకాణంలో ఉద్యోగం చేసేది. రోజూ ఆటోలో పనికి వెళ్లే భవానికి చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. తరచూ ప్రయాణాల కారణంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి నివసించలేదు. తమ తమ ఇళ్లలోనే ఉండేవారు. భవానికి ప్రేమ వ్యవహారం ఉందని మాత్రమే ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుందని వారికి తెలియదు. ఇదే సమయంలో కూతురికి మంచి సంబంధం చూడాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఒక యువకుడిని కూడా ఎంపిక చేశారు. కుటుంబ ఒత్తిడి పెరగడంతో భవాని ఆ పెళ్లికి అంగీకరించింది.
ఈ విషయం చంద్రశేఖర్ కు తెలియగానే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మరో పెళ్లి చేసుకోవద్దని అతను పలుమార్లు భవానిని కోరాడు. తనను బెదిరిస్తున్నాడని భవాని కూడా తల్లిదండ్రులకు చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కానీ పరిస్థితి రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారింది.
జూన్ 13న చంద్రశేఖర్ నేరుగా భవాని ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని తిరస్కరించాలని, పెళ్లి చేసుకోవద్దని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ భవాని అతని మాట వినలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన చంద్రశేఖర్ మరో పథకం వేశాడు. ఇద్దరం కలిసి విషం తాగి చనిపోదామని ఆమెకు చెప్పాడు. అయితే భవాని అందుకు అంగీకరించలేదు.
పోలీసుల వివరాల ప్రకారం, భవాని నిరాకరించడంతో చంద్రశేఖర్ బలవంతంగా ఆమెకు విషం తాగించాడు. అయినా అతని కోపం చల్లారలేదు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తాను కూడా కొద్దిపాటి విషం తాగాడు. తన దుస్తులపై కూడా కొంత విషం చల్లి ఇది ఆత్మహత్యలా కనిపించేలా నాటకం ఆడాడు. దీంతో కేసు అక్కడితో ముగిసిపోతుందని భావించాడు.
కానీ అతను చేసిన ఒక చిన్న పొరపాటు మొత్తం నేరాన్ని బయటపెట్టింది. ఆలయంలో జరిగిన తమ పెళ్లి ఫొటోలను చంద్రశేఖర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ స్టోరీని భవాని మేనత్త చూసింది. ఫొటోలో ఉన్నది భవానేనని గుర్తించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని భవాని తండ్రి శ్రీనివాస్ కు తెలియజేసింది.
అప్రమత్తమైన శ్రీనివాస్ వెంటనే కూతురిని సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం రావడంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులు లోపల నుంచి వేసి ఉండటంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా భవాని మృతదేహంగా కనిపించింది. అదే గదిలో చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. చంద్రశేఖర్ కు ఇదివరకే పెళ్లి అయిందని, అతనికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రేమతో మొదలైన ఒక పరిచయం, రహస్య వివాహంగా మారి, చివరకు ప్రాణాలు తీసిన నేరంగా ముగియడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఒక సోషల్ మీడియా స్టోరీ బయటపెట్టిన ఈ హత్య కేసు ఇప్పుడు బెంగళూరులో చర్చనీయాంశంగా మారింది.