Reading Time: 2 minutes
IPL 2026: ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే.. ఈ ఐదుగురు కుర్రాళ్ల ఆట చూస్తే పూనకాలే..!

IPL 2026 Emerging Players: భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ యువ కెరటాల దూకుడుతో హోరెత్తిపోతోంది. ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్లను సైతం భయపెడుతూ కొందరు యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుత ప్రతిభావంతులు ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు.

సంచలనాల వైభవ్ సూర్యవంశీ..

పదిహేనేళ్ల వయసు అంటే ఆటలాడుకునే ఈడు, కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. గత సీజన్‌లోనే తన బ్యాటింగ్ పవర్‌ను చూపించిన ఈ కుర్రాడు, ప్రస్తుత సీజన్‌లో మరింత భీభత్సం సృష్టిస్తున్నాడు. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 249 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఇతడు టీమ్ ఇండియాకు వెన్నెముకగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

సమీర్ రిజ్వీ పునరాగమనం..

గతంలో చెన్నై జట్టు తరపున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సమీర్ రిజ్వీ, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే 160 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇతడి బ్యాటింగ్ శైలిలో పరిణతి పెరగడం ఢిల్లీ జట్టుకు పెద్ద బలంగా మారింది. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే పట్టుదల ఇతడిని స్టార్‌గా మారుస్తోంది.

కోల్‌కతా ఆశాదీపం అంగ్‌కృత్ రఘువంశీ..

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా అంగ్‌కృత్ రఘువంశీ అవతరించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 55 సగటుతో 110 పరుగులు చేసి జట్టు విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాడు. నిలకడైన ఆటతీరుతో పాటు మైదానమంతా షాట్లు ఆడగల సామర్థ్యం ఇతడి సొంతం. ఈ సీజన్ అంగ్‌కృత్ కెరీర్‌కు మలుపు తిప్పే సీజన్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ సంచలనం హర్ష్ దూబే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న హర్ష్ దూబే తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా ఇతడికి ఉంది. రంజీ ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తూ సత్తా చాటుతున్నాడు.

వేగంతో వణికిస్తున్న ప్రిన్స్ యాదవ్..

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. గత సీజన్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, ఈసారి మాత్రం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఎనిమిది కంటే తక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తూ అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌గా మారుతున్నాడు. ఈ కుర్రాళ్ల ప్రదర్శన చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా ఉందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..