Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?

Pakistan: పాకిస్తాన్ సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఒకరిపై దాడిని మరొకరిపై దాడిగా చూస్తామని, వెంటనే ప్రతిస్పందిస్తామని ఒప్పంద సమయంలో పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది. తీరా ఇరాన్ యుద్ధంలో సౌదీ దాడులకు గురవుతున్నా కూడా నిస్సాహాయక స్థితిలో నిలబడింది. సౌదీకి అండగా, ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేయలేకపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తాన్ మరో గల్ఫ్ దేశంలో రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ సిద్ధమైంది. ఇందులో పాకిస్తానీ సైనికులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, వాయు రక్షణ వ్యవస్థలు మరియు ఇతర సైనిక సదుపాయాలను మోహరించడం వంటివి ఉన్నాయి. అయితే, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో యుద్ధ దళాలను పంపడంపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.
పాకిస్తాన్ రక్షణ ఒప్పందం పేపర్లపైనే ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయినప్పటికీ పాకిస్తాన్ సౌదీని రక్షించలేకపోయింది. ఇప్పుడు కువైట్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇదే పరిస్థితి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరు దేశాలు రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, ఇంధన భద్రత, పెట్టుబడుల గురించి చర్చిస్తున్నాయి. అయితే, ఈ ఒప్పందం ముందుకు వెళ్తే గల్ఫ్ దేశాలపై పాక్ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని, ఇది భారత భద్రతా ఆందోళనల్ని మరింత పెంచొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధమే కారణమా.?
గతంలో అమెరికా మిత్రదేశమైన ఖతార్లోని హమాస్ కీలక నేతల్ని చంపేందుకు ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత సౌదీ అరేబియా-పాకిస్తాన్ రక్షణ ఒప్పందానికి బీజం పడింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్ ఘర్షణల్లో కువైట్ తీవ్రంగా దెబ్బతింటోంది. ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కువైట్ తన భద్రతను పటిష్టం చేసుకోవడానికి కొత్త రక్షణ భాగస్వాముల కోసం అన్వేషిస్తోంది. పాకిస్తాన్, సౌదీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదరడంతో, కువైట్ కూడా ఈ దిశగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవల హౌతీ తిరుగుబాటుదారులు సౌదీపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ దాడిని తమపై జరిగిన దాడిగా చూస్తామంటూ పాకిస్తాన్ సంకేతాలు పంపింది. దీని తర్వాత కువైట్ రక్షణ ఒప్పందం తెరపైకి వచ్చింది. రక్షణ సహకారానికి ప్రతిఫలంగా పాకిస్తాన్ కువైట్ నుండి ఇంధన భద్రతను, పెట్టుబడులను ఆశిస్తోంది. కువైట్ కూడా పాకిస్తాన్లో ఇంధనాన్ని నిల్వ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది.
మరోవైపు, టర్కీ-పాకిస్తాన్-సౌదీ అరేబియా కూడా ఒక ప్రత్యేక త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై పనిచేస్తున్నాయి. బహ్రైయిన్ కూడా పాకిస్తాన్తో ఇలాంటి రక్షణ ఒప్పందంపై ఆసక్తి చూపిస్తోంది. జోర్డాన్ ఆయుధాల కొనుగోళ్లు, సైనిక శిక్షణపై ఆసక్తి వ్యక్తం చేసింది.