July 18, 2026

Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..

Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
Reading Time: < 1 minute
Ap Thalliki Vandanam Scheme Extended To Anganwadi Teachers Sanitation Workers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బందికి తీపి కబురు అందించింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్‌వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సిబ్బంది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంచి శుభవార్తను సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. గతంలో అంగన్‌వాడీలకు జీతాలు పెంచినా, గ్రాట్యుటీ ఇచ్చినా, ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసినా.. అది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే జరిగిందని ఆమె గుర్తుచేశారు. అంగన్‌వాడీల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నిర్ణయం సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, భరోసాను కల్పిస్తుందని మంత్రి అన్నారు.

ఈ నెల 22న నిధుల విడుదల..
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను జూలై 22న విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.10,120.78 కోట్లను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15,000 చొప్పున ఈ ఆర్థికసాయం జమ కానుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇప్పటికే అర్హుల జాబితాను వెరిఫై చేసిన ప్రభుత్వం, జూలై 22న గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించనుంది. కొత్తగా అడ్మిషన్లు పొందిన ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 30 నాటికి వారి తల్లుల ఖాతాల్లో ఈ ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు.