రైళ్లలో బెడ్షీట్ల చోరీ.. నాలుగేళ్లలో ఎన్ని కొట్టేశారో తెలుసా!

భారతీయ రైల్వే ఏసీ కోచ్లలో ప్రయాణించే కొందరు ప్రయాణికుల నిర్లక్ష్య ధోరణి అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. రైల్వే శాఖ ప్రయాణికులకు అందించే బెడ్రోల్ సామగ్రి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో చోరీకి గురవుతోంది. కొవిడ్ అనంతరం, అంటే 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్లకు పైగా టవళ్లు, దిండ్లు, దుప్పట్లు వంటి లెనిన్ వస్తువులు మాయమైనట్లు ఒక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని 54 రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ దొంగతనాల వల్ల కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ చోరీలు 56 శాతం పెరగడం గమనార్హం. ప్రయాణికులు అత్యధికంగా చేతివాటం ప్రదర్శించిన వస్తువుల్లో చిన్న ‘ఫేస్ టవల్స్’ మొదటి స్థానంలో ఉన్నాయి. గత నాలుగేళ్లలో సుమారు 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయమవగా, 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లను ప్రయాణికులు తమ వెంట పట్టుకెళ్లిపోయారు. బ్యాగుల్లో సర్దడానికి వీలుపడకపోవడం వల్లే దిండ్లు తక్కువగా చోరీకి గురయ్యాయని అధికారులు భావిస్తున్నారు. డివిజన్ల వారీగా చూస్తే బికనెర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల చోరీతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత రాంచీ, ఢిల్లీ, ముంబై డివిజన్లు ఉన్నాయి. ఈ నష్టాన్ని లెనిన్ పంపిణీ చేసే ఏజెన్సీలే భరించాల్సి వస్తోందని, ఈ దొంగతనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘పుష్ప 2’ తర్వాత మరో బిగ్ సర్ప్రైజ్.. బాసిల్ జోసెఫ్తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ?
Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు
సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్