July 18, 2026

Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..

Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
Reading Time: < 1 minute
Rohit Sharma Odi Retirement Rumors Lords England Series

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్న రోహిత్ శర్మకు ఇదే చివరి అంతర్జాతీయ పర్యటన కానుందని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో ఆఖరిది కానుందని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ స్పందిస్తూ బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మను బలవంతంగా రిటైర్మెంట్ వైపు నెట్టాలని చూస్తే, అది కేవలం అతనితోనే ఆగదని, విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్‌కు ముగింపు పలికే అవకాశం ఉందని హెచ్చరించారు. రోహిత్ శర్మపై తీసుకొస్తున్న ఈ అనవసర ఒత్తిడి కోహ్లీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా దెబ్బతీస్తుందని, ఒకవేళ ఒత్తిడి ఎక్కువైతే ఈ ఇద్దరు దిగ్గజాలు లార్డ్స్ వన్డే వేదికగానే రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లీ ఆటను ఇంకా చూడాలని కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు జరిగితే అది పెద్ద తప్పిదమవుతుందని పేర్కొన్నారు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా ఎదిగారు. అయితే ఈ ఏడాది ఆడిన ఎనిమిది వన్డేల్లో రోహిత్ కేవలం ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించి, 30.12 సగటుతో నిరాశపరిచారు. ఈ పేలవమైన ఫామ్ కారణంగానే 2027 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ 39 ఏళ్ల రోహిత్ శర్మకు బదులుగా యువ ఆటగాళ్లను పరిశీలిస్తోందనే ఊహాగానాలు బలపడ్డాయి. దీనిపై జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రోహిత్ శర్మ స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది.