Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..

Citizenship: భూమి రికార్డులు లేదా ఆస్తి పత్రాలు భారత పౌరసత్వానికి రుజువు కాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. విదేశీయుడు భారతదేశంలో ఆస్తి కొనుగోలు చేసినంత మాత్రాన అతను భారతీయ పౌరుడిగా మారిపోడని పేర్కొంది. బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారుడిగా గుర్తించిన నసీర్ మొల్లా దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇతడిని బంగ్లాదేశీయుడిగా అనుమానించిన బెంగాల్ పోలీసులు జూన్లో అదుపులోకి తీసుకున్నారు.
నసీర్ మొల్లా ప్రస్తుతం డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. ఆయన తరుఫు బంధువులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నసీర్ భారతీయుడే అని ఆయన తరుఫు న్యాయవాది వాదించాడు. అయితే, విచారణలో భారత పౌరసత్వాన్ని చూపించే పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించగా, భూమి రికార్డులు తప్పా ఇతర ఆధారాలు లేవని పిటిషనర్ తరుఫు న్యాయవాది తెలిపారు.
దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘భూమి రికార్డులు భారత పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు కావు. విదేశీయులు భారతదేశంలో స్థిరాస్తి కొనుగోలు చేయవచ్చు, ఆస్తి కొనుగోలు చేసినంత మాత్రాన భారతీయ పౌరసత్వం లభించదు’’ అని పేర్కొంది. నసీర్ మొల్లాకు మరో అవకాశం ఇస్తూ, జూలై 20లోగా పౌరసత్వాన్ని నిరూపించే ఇతర పత్రాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం పాస్పోర్టు మాత్రమే పౌరసత్వానికి తుది ఆధారం కాదని స్పష్టం చేసింది. అది కేవలం ట్రావెట్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పింది. కొన్ని సందర్భాల్లో భారతీయులు కాని వారికి కూడా పాస్పోర్టు జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశంపై 2013లో బాంబే హైకోర్టు కూడా పాస్పోర్టు కలిగి ఉండటం మాత్రమే భారత పౌరసత్వాన్ని నిరూపించే ఆధారం కాదని తీర్పు చెప్పింది.