July 18, 2026

Pakistan: సింధు జలాలపై పాక్‌కు ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల

Pakistan: సింధు జలాలపై పాక్‌కు ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల
Reading Time: 2 minutes
Pakistan Paying India Share Indus Waters Treaty Arbitration Costs

సింధు జలాల ఒప్పందం వివాదంలో పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొనకపోవడంతో పాటు ఒప్పందాన్ని తాత్కాలికంగా అమల్లో లేకుండా ఉంచిన నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ విచారణ ఖర్చులన్నీ పాకిస్థానే పూర్తిగా భరిస్తోందని నివేదికలు అందుతున్నాయి. భారత్ చెల్లించాల్సిన వాటాను కూడా ఇస్లామాబాద్‌నే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా సింధు జలాల ఒప్పందం ప్రకారం.. మధ్యవర్తిత్వ విచారణల ఖర్చులను భారత్-పాకిస్తాన్‌లు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. అలాంటిది భారత్ దూరంగా ఉండడంతో గత్యంతరం లేక పాకిస్థాన్ ఒక్కటే ఆ ఖర్చులను భరిస్తోంది.

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) దగ్గర కొనసాగుతున్న ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ ఇప్పటికే 6 లక్షల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

సింధు జలాల ఒప్పందం ప్రకారం.. మధ్యవర్తిత్వ ప్రక్రియకు సంబంధించిన ఖర్చులను భారత్, పాకిస్థాన్ సమానంగా భరించాలి. అయితే 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాల్గొనడాన్ని నిలిపివేసింది. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయమైన, శాశ్వత చర్యలు తీసుకునే వరకు ఒప్పందం అమల్లో ఉండదని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగిస్తూ.. రెండు దేశాల తరఫున చెల్లించాల్సిన ఖర్చులను కూడా తానే భరిస్తోందని సమాచారం.

వివాదం ఏంటి?

ఈ వివాదం ప్రధానంగా కిషన్‌గంగా-రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. సింధు జలాల ఒప్పందం పరిధిలోని పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులు ఒప్పందానికి విరుద్ధమని ఆరోపిస్తూ పాకిస్థాన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. అయితే ఇలాంటి సాంకేతిక అంశాలను న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ మాత్రమే పరిశీలించాలని, ఒకేసారి న్యూట్రల్ ఎక్స్‌పర్ట్‌తో పాటు ఆర్బిట్రేషన్ ప్రక్రియను కొనసాగించడం ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని భారత్ వాదిస్తోంది.

పీసీఏ అధికారాన్ని తిరస్కరించిన భారత్

పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు ఈ కేసును విచారించే అధికారం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ ట్రైబ్యునల్‌ను ‘‘చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారు’’ అని పేర్కొంటూ.. దీనివల్ల వెలువడే తీర్పులు చెల్లవని భారత్ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం.. ఒక పక్షం విచారణకు హాజరు కాకపోయినా, ట్రైబ్యునల్‌కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణ కొనసాగించవచ్చు. ఈ నేపథ్యంలో పీసీఏ పాకిస్థాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు తనకు అధికారం ఉందని ప్రకటించింది. అయితే భారత్ మాత్రం ఇప్పటికీ ఈ ప్రక్రియకు దూరంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాల్గొనని పరిస్థితి కొనసాగి.. పాకిస్థాన్ కేసును ముందుకు తీసుకెళ్తే.. మధ్యవర్తిత్వానికి సంబంధించిన మొత్తం ఖర్చును ఇకపై కూడా పాకిస్థానే భరించాల్సి వచ్చే అవకాశం ఉంది.