July 14, 2026

నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!

నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
Reading Time: < 1 minute
Brics Trade Union Forum Summit 2026 Begins In Hyderabad Representatives From 10 Nations Attend

BRICS Trade Union Forum Summit: హైదరాబాద్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 జరగనుంది. భారత అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హైదరాబాద్ వేదికగా మారింది. కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, బెలారస్, సౌదీ అరేబియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. కార్మిక రంగంలో సహకారం, విధానాలు, సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకోనున్నారు.

నేడు ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ప్రారంభ సమావేశం జరుగుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో “వర్కర్స్ కాన్‌ఫ్లుయెన్స్” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, బెలారస్, భారత్ ప్రతినిధులు ప్రసంగించనున్నారు.

జూలై 15 ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో BRICS దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలు, ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారు. భారత్, చైనా, ఈజిప్ట్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఇక జూలై 15 సాయంత్రం 5 గంటలకు ముగింపు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ ప్రకటనను అధికారికంగా ఆమోదించనున్నారు. ఇందులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. చివరగా అంతర్జాతీయ ప్రతినిధుల సందేశాలతో BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026 ముగియనుంది.