
హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ప్రతిస్పందించానని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే తాను స్పందించానన్నారు. తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని, హోంమంత్రి అనిత మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తే.. తన స్పందన కూడా అలాగే ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ ఫేక్ ఉద్యమాన్ని నడుపుతోందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
తాను చేసిన వ్యాఖ్యలను మహిళా లోకానికి, దళిత సమాజానికి ముడిపెట్టడం పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. జూన్ 12న తాను మాట్లాడితే, మూడు రోజుల తర్వాత టీడీపీ నాయకత్వానికి ఒక్కసారిగా బాధ కలిగిందని ఎద్దేవా చేశారు. మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ప్రజలే తప్పుబట్టారని అన్నారు. టీడీపీ మహిళలకు, వైసీపీ మహిళలకు వేర్వేరు గౌరవాలు ఉండవని.. మహిళలందరినీ గౌరవించే సంస్కారం తమ పార్టీలో ఉందని చెప్పారు. మూడు తరాల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనను హోంమంత్రి అనిత అమర్యాదకరంగా సంబోధించారని, దానికి ప్రతిస్పందనగానే తాను మాట్లాడాల్సి వచ్చిందని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.
వైఎస్ కుటుంబ సభ్యులపై హోంమంత్రి అనిత గతంలో చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. భారతమ్మ, విజయమ్మలపై చేసిన వ్యాఖ్యలకు అనిత ఎప్పుడైనా క్షమాపణ చెప్పిందా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఎప్పుడైనా స్పందించారా అని నిలదీశారు. వైఎస్ కుటుంబ సభ్యులపై కూడా హోంమంత్రి నీచంగా మాట్లాడారని.. ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా? అన్ని అడిగారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వారు అలా మాట్లాడొచ్చా అని చురకలు వేశారు. తనకు మహిళల పట్ల గౌరవం లేదని చెప్పడం అవాస్తవమన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తర్వాత తమ కుటుంబాన్ని తల్లి నడిపించిందని, తల్లి-చెల్లెల మధ్య పెరిగిన తనకు మహిళల విలువ బాగా తెలుసని చెప్పారు. అందుకే మహిళలను ఉద్దేశించి మాట్లాడే ప్రసక్తే లేదని గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు.
హోంమంత్రి గారు దేశంలో ఎక్కడైనా తనపై ఫిర్యాదు చేసుకోవచ్చని, తాను చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. తాను ఎక్కడా తగ్గేది లేదని, ఒక మహిళ చేసిన వ్యాఖ్యలకు మాత్రమే సమాధానం ఇచ్చానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటన, రిమాండ్ ఖైదీ మృతి వంటి అంశాలపై హోంమంత్రి స్పందించలేదని విమర్శించారు. తనపై రాజకీయ దాడులు చేయడం ద్వారా అసలు సమస్యలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. జనసేన పార్టీపై కూడా విమర్శలు గుప్పించిన అమర్నాథ్.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ను జనసేన నాయకులు చదువుతున్నారని ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ రోజాపై చేసిన వ్యాఖ్యలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.