
రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ముడావత్ గాంధీ నాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, బనావత్ తుల్స్య నాయక్, ముడావత్ బాలకృష్ణ నాయక్, రామవత్ వాగ్య నాయక్, మైనర్ బాలుడు జల్సా లకు అలవాటు పడ్డారు. తొలుత ఈజీ మన కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. డీజిల్ దొంగతనంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఈ ముఠా పథకం వేసింది. నిందితులు ముందుగా రెండు డీసీఎం వాహనాల్లో బయలుదేరుతారు. హైవేలపై అర్ధరాత్రి వేళ ఆగి ఉన్న లారీలు, ఇతర వాహనాలను టార్గెట్ గా రెక్కీ చేస్తారు. వాహనాల డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో అత్యంత వేగంగా డీజిల్ ట్యాంకుల సీల్ తొలగించి డీజిల్ను దొంగిలిస్తారు. దొంగిలించిన డీజిల్ను తమ వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నింపుకుంటారు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతుంటారు. ఇలా దొంగతనం చేసిన డీజిల్ ను ఏపీలో వివిధ ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటారు.
నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన DCM వాహనాన్ని గమనించారు. వాహనాన్ని తనిఖీ చేయగా 400 లీటర్ల డీజిల్ తో నిండిన క్యాన్లు దాచిపెట్టినట్టు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ బాలకృష్ణ ఇతరులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా ముఠా గుట్టు రట్టయింది. ఆరుగురు గుట్ట సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా డీజిల్ దొంగతనం కేసులు నమోదయాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా నుండి వెయ్యి లీటర్ల డీజిల్, రెండు DCM వ్యాన్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైవేలపై వాహనాలు నిలిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
Also Read: మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..