Reading Time: 2 minutes
Off The Record About Kolikapudi Srinivas Controversy Telugu Desam Party Brings Devadath To Counter Tiruvuru Mla

Off The Record: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఆయన ఏం మాట్లాడినా, సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా సంయమనం పాటించడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వార్నింగ్‌ ఇవ్వడం వరకే పరిమితమైన అధిష్టానం ఇప్పుడు ఉలిక్కిపడి దిద్దుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడి ఇటీవల కొత్తగా దళిత కార్డ్‌ ప్రయోగించడంతో పార్టీ పెద్దలు కూడా అలర్ట్‌ అయ్యారట. ఆయనకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అలాగే అధికారంలో ఉన్న తమ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి అధిష్టానం అగ్రహానికి గురయ్యారాయన. ఈ క్రమంలోనే… నియోజకవర్గంలో ఉన్న నెమలి ఆలయంలో వేణుగోపాల స్వామి కళ్యాణానికి పట్టువస్తాలను సమర్పించే వ్యవహారంలో వివాదాస్పదమైంది. అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశమైంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ ప్రయత్నించగా… వాటిని ఎమ్మెల్యే లాక్కుని సమర్పించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఆ ఎపిసోడ్‌లో ఎంపీ కేశినేని టార్గెట్‌గా ఎమ్మెల్యే కొలికపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలతో తిరువూరు రాజకీయం గరంగరంగా మారిపోయింది.

ఎమ్మెల్యే దళిత వాదనను తెర మీదికి తీసుకురావడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుందని అంటున్నారు. ఎమ్మెల్యే అయి ఉండికూడా తాను నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్నానని, తనను అంతం చేసే కుట్రలు కూడా జరిగాయంటూ చాలాపెద్ద ఆరోపణలే చేశారు కొలికపూడి. నాతో సంబంధం లేకుండా నా నియోజకవర్గంలో ఎంపీ కార్యకర్తల సమావేశం పెట్టబోయారు. అదేపని ఆయన వేరే సెగ్మెంట్‌లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే. అలా ప్రశ్నిస్తూనే…. నన్ను అవమానిస్తే భరిస్తాగానీ….నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ కొత్తగా కులం ప్రస్తావన తీసుకురావడం కలకలం రేపింది. దీంతో టీడీపీ నాయకులు కూడా ఇదేదో తేడా కొట్టేలా ఉందంటూ అలర్ట్‌ అయిపోయి… అట్నుంచి కూడా అదే కోణంలో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారట. ఎంపీ కేశినేని చిన్ని వర్గంలో ఉన్న కొలికపూడి సామాజిక వర్గానికి చెందిన నేత తాజాగా మాట్లాడ్డం అందులో భాగమేనని అంటున్నారు. స్థానిక నాయకుడు, రాష్ట్ర ఆర్గానిక్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ దేవదత్ రంగంలోకి దిగడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. ప్రస్తుతం దేవదత్‌ నియోజకవర్గంలో అన్ని విధాలా కొలికపూడి తీరును ఎండగడుతున్నారు. అసలు కొలికపూడిని నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, పార్టీ అధిష్టానం తన మీద చర్యలు తీసుకున్నా సరే… ఆ విషయంలో తగ్గేది లేదని, ఎమ్మెల్యే సంగతి తెలుస్తామంటూ నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాల్లో తరచూ అంటున్నారట దేవదత్.

దీన్నిబట్టి చూస్తుంటే… ఇక నుంచి ఎమ్మెల్యే ఏం మాట్లాడినా దేవదత్ నుంచి గట్టి కౌంటర్స్‌ పడతాయని అంటున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న కారణం అయితే… దేవదత్‌ అలా రెచ్చిపోవడం వెనక మరో యాంగిల్‌ కూడా ఉందట. ఇద్దరి మధ్య పాతపగలు కూడా ఉన్నాయంటూ సరికొత్త అనాలసిస్‌ చేస్తున్నారు కొంతమంది. కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు ఎమ్మెల్యే మీద వ్యక్తిగత కోపం కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో తిరువూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదట దేవదత్‌నే నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం మూడేళ్ల పాటు తిరువూరులో పనిచేశారాయన. కానీ… ఎన్నికలకు నెల రోజులు ముందు సీన్‌ మార్చేసి కొలికపూడి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం. ఇప్పుడు అదే నాయకుడితో పార్టీ, ఎంపీ సతమతం అవుతున్న పరిస్థితి. అప్పుడు తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ రాకపోవడానికి కొలికపూడే కారణమన్న కోపం కూడా కలిపి దేవదత్‌ ఇప్పుడు చెలరేగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకవైపు పార్టీ తరఫున మాట్లాడుతూనే… పనిలో పనిగా తన పర్సనల్‌ కసిని కూడా తీర్చుకుంటున్నారట. ఇదంతా చూస్తున్న వారు స్వామి కార్యం-స్వకార్యం సామెతను గుర్తు చేసుకుంటున్నారు. అయితే… ఈ కొత్త యాక్షన్‌కు ఎమ్మెల్యే రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.