July 7, 2026

AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
Reading Time: 2 minutes
Ap Govt Announces Cash Incentive For Families With Three Children

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడటం , కుటుంబ సంక్షేమాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ సంతానాన్ని ప్రోత్సహించేలా సరికొత్త నగదు బహుమతులను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో మారుతున్న జనాభా రేటు, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.

ముగ్గురు పిల్లలు ఉంటే రూ. 5,000 నగదు..
నూతన విధానం ప్రకారం… ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించనుంది.  జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా  ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మూడు జంటలను ఎంపిక చేసి, వారికి రూ. 5,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నారు. మొత్తం 84 జంటలకు లబ్ధి చేకూరనుంది.  వైద్య ఆరోగ్య శాఖ సమక్షంలో ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది.

కాన్పుల మధ్య విరామానికి ప్రాధాన్యత..
కేవలం సంతానాన్ని పెంచడమే కాకుండా, తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఒక కాన్పుకు, మరో కాన్పుకు మధ్య కనీసం రెండేళ్ల కాలం పాటు విరామం పాటించిన 6 జంటలకు సైతం రూ. 5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయించారు. ఇది తల్లుల శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువ మంది అర్హులుంటే లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.

రూ. 56 లక్షలతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు..
ఈ సరికొత్త విధానాలు , కుటుంబ నియంత్రణ/సంక్షేమ మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాల కోసం పబ్లిసిటీ బడ్జెట్ కింద రూ. 56 లక్షల నిధులను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికీ ఈ పథకాలపై స్పష్టత వచ్చేలా సమాచార శాఖ, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయనున్నాయి.

ఈ నెల 11 నుంచి 18 వరకు ప్రత్యేక డ్రైవ్..
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వారోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరియు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొని అర్హులైన దంపతులను గుర్తించి, ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తారు.