Reading Time: < 1 minute
Ap High Court Stays Acb Court Order Allowing Release Of Gold Seized In Corruption Cases

AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.

Read Also: CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విడుదల చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు జరుగుతుండగా, మరోవైపు నామమాత్రపు పూచికత్తుతో ఆభరణాలు విడుదల చేయడం దర్యాప్తుకు విఘాతం కలిగించే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ తరఫు న్యాయవాది శ్యామలరావు వాదనలు వినిపిస్తూ, అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సులభంగా విడుదల చేయడం వల్ల దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వం పరం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వివరించారు.

అలాగే, కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఆభరణాలు అత్యవసరంగా అవసరమైతే, వాటి విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందని ఏసీబీ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.