Reading Time: < 1 minute
Ap Plans Integrated Strategic Material Hub Chandrababu Focus On Beach Sand Minerals

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్. . రూపకల్పన, పెట్టుబడులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధనే లక్ష్యం కావాలన్నారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్‌ పైనా మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. వనరుల సద్వినియోగం చేసుకోవాలంటే వాటిపై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలన్నారు.

రాష్ట్ర తీరప్రాంతాల్లో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని అధికారులు తెలిపారు. వీటిలో ముఖ్యంగా.. ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి. ఈ ఖనిజాలు పెయింట్స్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమ, ఏరోస్పేస్, రక్షణ రంగం, శస్త్రచికిత్స పరికరాలు, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం మరియు అణు రియాక్టర్ భాగాల తయారీ వంటి కీలక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలో లభిస్తున్న ఈ ఖనిజాలను సమర్థంగా వినియోగించుకోవడానికి మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు.

– శ్రీకాకుళంలో టైటానియం పార్క్ – సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
– అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్ – సంవత్సరానికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం.
– మచిలీపట్నంలో సమగ్ర టైటానియం మరియు రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి పెద్ద ఊతం లభించడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.