Reading Time: < 1 minute
IND vs NZ: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్‌కు అంపైర్లు వీరే.. టీమిండియా మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?

India vs New Zealand: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్ల జాబితాను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. విశేషమేమిటంటే, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు అంపైర్‌గా ఎంపికయ్యారు. గతంలో 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ (భారత్ vs సౌతాఫ్రికా) ఆయనే అంపైర్‌గా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఫైనల్ మ్యాచ్ అంపైర్లు వీరే..

రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు భారీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అనుభవం ఉంది. ఆయన 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోనూ అంపైరింగ్ చేశారు. మరోవైపు అలెక్స్ వార్ఫ్‌కు ఇది మొదటి సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన వార్ఫ్, 2022 మహిళల ప్రపంచకప్, 2023 పురుషుల ప్రపంచకప్‌లోనూ తన సేవలు అందించారు. వీరిద్దరూ ఈ టోర్నీలో కోల్‌కతా వేదికగా జరిగిన న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా సెమీఫైనల్‌లోనూ అంపైర్లుగా వ్యవహరించారు.

థర్డ్ అంపైర్, మ్యాచ్ రెఫరీ..

ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్ థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక ఫోర్త్ అంపైర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వ్యవహరించనున్నారు. ఈ మెగా ఫైనల్‌కు మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న పాలేకర్ ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే 6 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు.

భారత్ ముందు అరుదైన అవకాశం..

టీమ్ ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడానికి కేవలం అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్ గడ్డపై గెలిస్తే, వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. 2021లో ఫైనల్ చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఎలాగైనా తొలి ట్రోఫీని ముద్దాడాలని కివీస్ పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.