Reading Time: < 1 minute
Muralidhar Goud: ‘బలగం’ నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శశికళ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె శుక్రవారం (మార్చి 06) తుదిశ్వాసవిడిచారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శశికళ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాంటూ ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో నటుడు మురళీధర్ కు ధైర్యం చెబుతున్నారు. ఐరేని మురళీధర్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా రామాయం పేటలో జన్మించారు.  సిద్దిపేటలో తన విద్యాభాస్యం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేశాడు. సుమారు  27 ఏళ్లు పని చేసిన మురళీ ధర్ 2012లో పదవీ విరమణ చేశాడు. అయితే రిటైర్మెంట్ అయ్యాక నటనపై ఆసక్తిని పెంచుకున్నారాయన.  మెల్లగా సినీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా 2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఒక చిన్న పాత్రలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో హీరో తండ్రి పాత్రలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. బలగం, మేమే ఫేమస్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, మంగళవారం, కింగ్ డమ్, దండోరా తదితర సినిమా్ల్లో సహాయ నటునిగా మెప్పించారీ సీనియర్ నటులు.

 

ఈ ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, బరాబర్ ప్రేమిస్తా, ఫంకీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు మురళీధర్. కాగా గతంలో భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారీ సీనియర్ నటుడు. ఇక  శశికళ.. గతంలో రామాయంపేట, పంచాయతీగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్‌గా కూడా పనిచేశారట.