Reading Time: 2 minutes

భారత్‌లో ఫుట్బాల్ వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్టింగ్కి గ్రీన్ సిగ్నల్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అప్పుడే! 

Caption of Image.

FIFA World Cup 2026: భారతదేశంలోని కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులకు అత్యంత ఊరటనిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. రాబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల (Media Rights) వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ముగింపు పలుకుతూ.. భారత్‌లో టెలికాస్ట్ హక్కులకు సంబంధించిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. వచ్చే వారంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. 

షాజీ ప్రభాకరన్ క్లారిటీ:
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) మాజీ జనరల్ సెక్రటరీ షాజీ ప్రభాకరన్ శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) లో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వామికి సంబంధించిన చర్చలు పూర్తిగా పూర్తయ్యాయి.. వచ్చే వారంలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది.. నెలల తరబడి కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడటంతో ఫ్యాన్స్ ఇక రిలాక్స్ అవ్వొచ్చు.. చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్ కప్‌ను భారత్‌లో పూర్తిగా వీక్షించవచ్చని షాజీ ప్రభాకరన్ తన పోస్ట్‌లో వెల్లడించారు. 

ఎందుకీ ఆలస్యం?: 
ఫిఫా (FIFA) అధికారులు మొదట భారతీయ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఏకంగా 100 మిలియన్ డాలర్లు (USD 100 Million) డిమాండ్ చేశారు. కానీ, భారతీయ కంపెనీలు అంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాయి. ఆ తర్వాత ఫిఫా ఈ ధరను 35 మిలియన్ డాలర్లకు తగ్గించినప్పటికీ.. కంపెనీలు వెంటనే ఒప్పుకోలేదు. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు అన్నీ భారతదేశ కాలమానం ప్రకారం అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున (Late Night) జరగనున్నాయి. ఇంత లేట్‌గా వచ్చే మ్యాచ్‌లకు స్పాన్సర్లు, యాడ్స్ (Advertisers) రావడం కష్టమని ఇండియన్ మీడియా కంపెనీలు వెనక్కి తగ్గిపోయాయి. 

►ALSO READ | లండన్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా.. పాకిస్తాన్‌తోనే ఫస్ట్ ఫైట్, వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదే!

దూసుకుపోతున్న ‘జీ’: 
ఈ నెల ఆరంభంలో ప్రభుత్వ రంగ ఛానల్ ప్రసార భారతి (DD Sports) ఈ హక్కుల రేసులో తాము లేమని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్‌లో మరింత గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ మీడియా దిగ్గజం జీ నెట్‌వర్క్ (Zee) ఈ ఫిఫా వరల్డ్ కప్ హక్కులను దక్కించుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శుక్రవారం రాత్రి ఫిఫా ఉన్నతాధికారులతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఒక అగ్రిమెంట్ కుదిరిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.