
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పనివేళలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత పెరగకముందే పాఠశాలలను ముగించాలని కోరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల పనివేళలు మార్చాలని విద్యాశాఖను ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుతున్నాయి.
ఇంతటి తీవ్రమైన ఎండలో మధ్యాహ్నం వరకు పాఠశాలలు నిర్వహించడం వల్ల విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతున్నారు. చిన్న పిల్లలు ఎండ తీవ్రతను తట్టుకోలేరని, తరగతి గదుల్లో ఉక్కపోత వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఒంటిపూట బడులు నడుస్తున్నప్పటికీ, 11 గంటల తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున ఆ సమయానికే విద్యార్థులను ఇంటికి పంపడం మేలని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వేసవి సెలవుల షెడ్యూల్..
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉండనున్నాయి. అంటే మరో పది రోజుల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పది రోజులు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, తక్షణమే పనివేళల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయులు అడుగుతున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..