Reading Time: < 1 minute
Sanju Samson Player Of The Tournament Mitchell Santner Reacts To Farhan Debate

భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. కీలక మ్యాచ్‌లలో సత్తాచాటిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ టోర్నీలో అత్యధికంగా 383 పరుగులు చేసినప్పటికీ.. అవార్డు సంజుకు దక్కింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ‘సాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. అయినా సంజు శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం ఎలా చూస్తారు?’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు స్పందించిన సాంట్నర్‌ ముందుగా ‘క్షమించండి.. ఎవరు?’ అని అడిగాడు. జర్నలిస్ట్ మళ్లీ ‘పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్’ అని బదులిచ్చాడు.

Also Read: Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

దీనికి మిచెల్ సాంట్నర్‌ మాట్లాడుతూ… ‘అవార్డులు కేవలం గణాంకాల ఆధారంగా ఇవ్వరు. ఓ ప్లేయర్ మ్యాచ్‌పై చూపిన ప్రభావాన్ని బట్టి ఇస్తారు. సంజు శాంసన్ మూడు కీలక మ్యాచ్‌లలో అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక దశల్లో సంజు ప్రదర్శన భారత్‌కు టైటిల్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీలంక వంటి చిన్న జట్లపై ఫర్హాన్ పరుగులు చేశాడు. మ్యాచ్‌పై ప్రభావం చూపే ఇన్నింగ్స్‌లు అతడు ఆడలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు సంజు అర్హుడు’ అని వివరణ ఇచ్చాడు. సాంట్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా కీలక మ్యాచ్‌లలో జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లకే ఇలాంటి అవార్డులు రావాలని అభిప్రాయపడుతున్నారు.