
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో మోస్తరు వర్షం, మోస్తరు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని స్పష్టం చేసింది,. కొమరం భీమ్ ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్లలోపు వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి వర్షం, ఉరుములు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
నేటి నుంచి ఈ నెల 24 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత 25వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అయితే శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురిశాయి. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో అత్యధిక వర్షపాతం 7.4 సెంటీమీటర్లు నమోదవ్వగా.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో 3.4 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 6.7 మి.మీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 21,22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని స్పష్టం చేసింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్గా కూడా మారే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 22,23వ తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే తుఫాన్ ముప్పు పొంచి ఉన్న క్రమంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ చెబుతోంది.