
ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్లో పర్యటిస్తున్నారు. రాజధాని బిష్కెక్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఫిబ్రవరిలో ఇరాన్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత మోడీ, పెజెష్కియాన్ ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల తాజా పరిస్థితిని ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినట్లు ఇరాన్కు చెందిన సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ తస్నీమ్ వెల్లడించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్రిక్త పరిస్థితుల వేళ..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇరాన్కు భారత్ టాప్-10 వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉంది. అయితే హార్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.

అంతకుముందు మార్చి 21న మోడీ, పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. జూన్లోనూ ఇరువురు నేతలు ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రాచ్య పరిణామాలపై పెజెష్కియాన్ మోడీకి వివరించారు. ఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహనను మోడీ స్వాగతించడంతో పాటు శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం నిరంతర ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు.
అర్మేనియా ప్రధాని పాషిన్యాన్తోనూ మోడీ భేటీ
ఎస్సీవో సదస్సు సందర్భంగా మోడీ అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యాన్తోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మాస్యూటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. పశ్చిమాసియా పరిస్థితితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్-అర్మేనియా సంబంధాలను మరింత లోతుగా, విస్తృతంగా తీసుకెళ్లేందుకు అర్మేనియాతో కలిసి పనిచేయాలని భారత్ ఎదురుచూస్తోందని మోడీ తెలిపారు.
పుతిన్తోనూ మోడీ భేటీ?
ఇదిలా ఉండగా.. మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.