Reading Time: < 1 minute
Duleep Trophy Semifinal Day 2 Highlights Suryavanshi Tilak Varma

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ రెండో రోజు ఆటలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేష్ కుమార్, అభిజిత్ సర్కార్ చెరో 3 వికెట్లు, మహమ్మద్ షమీ, కౌనైన్ ఖురేషి చెరో 2 వికెట్లు పడగొట్టారు.

ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ ధాటిగా ఆడారు. వైభవ్ 42 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, కేవలం 8వ ఓవర్లలోనే జట్టు స్కోరును 50 దాటించారు. 15వ ఓవర్‌లో 100 పరుగులు పూర్తి కాగా, వైభవ్ 92 పరుగుల వద్ద హర్ష్ దూబే బౌలింగ్‌లో సెంచరీ మిస్ చేసుకుని అవుటయ్యాడు. అనంతరం కుమార కుశాగ్ర గోల్డెన్ డకౌట్ కాగా, అభిమన్యు ఈశ్వరన్ 69 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సుదీప్ కుమార్, విరాట్ సింగ్ తక్కువ పరుగులకే అవుటయ్యారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 16 పరుగులు, అనుకూల్ రాయ్ 16 పరుగులు, కౌనైన్ ఖురేషి 13 పరుగులు చేశారు.

రెండో సెమీఫైనల్‌లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా, సౌత్ జోన్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ తిలక్ వర్మ (155 బంతుల్లో 58 పరుగులు), శ్రేయస్ గోపాల్ (127 బంతుల్లో 65 పరుగులు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి బాధ్యతాయుతమైన ఆటతీరుతో సౌత్ జోన్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.

క్వార్టర్ ఫైనల్స్‌లో ఘన విజయాలు సాధించి ఈస్ట్ జోన్, నార్త్ జోన్ జట్టులు సెమీస్ చేరగా, డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్, సౌత్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లలోనూ హోరాహోరీ పోరు కొనసాగుతోంది.