
Hardik Pandya: చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియాన్స్ ఘోర పరాజయం చవిచూసింది. ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటములతో విసిగిపోయిన పాండ్యా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, ఇదే తమ పతనానికి కారణమని అభిప్రాయపడ్డాడు. లక్ష్య ఛేదనలో ఆరంభం బాగుంటేనే ఫలితం అనుకూలంగా వచ్చేదని, కానీ ఈ మ్యాచ్లో అది సాధ్యపడలేదని పేర్కొన్నాడు. పిచ్ గురించి వివరిస్తూ.. “పిచ్లో మార్పు వచ్చిందని నేను సాకులు చెప్పను. ముంబై బ్యాటర్లలాగే వాళ్లూ అదే ట్రాక్పై బ్యాటింగ్ చేశారు. వాళ్లు 207 పరుగులు చేశారంటే అది వారి ప్రతిభ. పిచ్ ఒకేలా ఉన్నప్పుడు మేము కూడా బాగా బ్యాటింగ్ చేయాల్సింది” అని హార్దిక్ అన్నాడు.
ఈ మ్యాచ్లో బంతి కాస్త గ్రిప్ అవుతున్న మాట వాస్తవమేనని, తమ స్పిన్నర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు. అయితే సంజూ శామ్సన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ను మలుపు తిప్పిందని, ఇతర బ్యాటర్లు సైతం అతనికి సహకరించడంతో చెన్నై ఒక భారీ స్కోరును సాధించగలిగిందని కొనియాడాడు. ముందున్న మ్యాచుల కోసం జట్టులో మార్పులు ఉంటాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “జట్టు కూర్పుపై ఖచ్చితంగా చర్చ జరుపుతాం. మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఏం చేయాలో కూర్చుని ఆలోచిస్తాం. మాకు ఇంకా సమయం ఉంది, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఏం చేయగలమో దానిపై దృష్టి సారిస్తాం” అని హార్దిక్ స్పష్టం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న వాంఖడే స్టేడియంలో చెన్నై 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్ బరిలోకి దిగిన ముంబై పేలవ బ్యాటింగ్తో ఓటమిపాలైంది. స్పిన్నర్లు అకీల్ హొసీన్, నూర్ అహ్మద్ల ధాటికి విలవిలలాడిన ముంబై సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక మొదట చెన్నై ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లు చేతులెత్తేసినా.. సంజు శామ్సన్ మాత్రం అద్భుతంగా రాణించాడు. రెండో శతకంతో జట్టుకు మెరుగైన స్కోరునందించాడు. దీంతో గత మ్యాచ్లో గుజరాత్ను 100 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. ఈ మ్యాచ్లో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.