Reading Time: < 1 minute
Hormuz: హర్మూజ్ వద్ద హైటెన్షన్.. మరోసారి భారత్‌కు వస్తున్న నౌకపై ఇరాన్ కాల్పులు..

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో హర్మూజ్ గుండా వస్తున్న భారత్ సహా రెండు నౌకరలపై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. ఇరాన్ మీడియా ,BBC నివేదికల ప్రకారం.. లైబీరియా జెండాతో ఉన్న ఎపామినోండాస్ అనే నౌక భారతదేశానికి వస్తోండగా హోర్ముజ్ జలసంధిలో ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ గన్‌బోట్ దీనిపై కాల్పులు జరిపింది. ఇరాన్ అధికారుల దాడిలో నౌక బ్రిడ్జ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇక దాడికి గురైన మరో నౌక పమానా జెండాతో వెళ్తున్న యురోపియాగా తెలుస్తోంది. ఈ నౌక యూఏఈలోని షార్జా నుండి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోండగా దీనిని ఇరాన్ బలగాలు అడ్డుకున్నాయి. అలాగే పనామా జెండాతో వెళ్తున్న MSC ఫ్రాన్సిస్కా అనే నౌకపై కూడా ఇరాన్ దాడి పాల్పడింది.

అయితే దాడి తర్వాత ఈ మూడు నౌకల్లో భారత్‌కు వస్తున్న ఎపామినోండాస్, MSC ఫ్రాన్సిస్కాలను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకుని, తమ తీరానికి తరలించాయి. తర్వాత ఈ దాడిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పందిస్తూ.. ఈ నౌకలు అనుమతులు లేకుండా ప్రయాణిస్తూ, నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేశాయని, ఎవరైనా హోర్ముజ్ జలసంధిలో భద్రతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని చెప్పుకొచ్చింది.

అయితే ఇరాన్‌తో శాంతి చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. మరోవైపు ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా ఇరాన్ నౌకలు, ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమలు చేస్తున్న అమెరికా దళాలు, ఒమన్ గల్ఫ్ నుండి ఒక ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోగా, హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి మరో రెండు నౌకలను అడ్డగించాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ నౌకాయాన రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.