
Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ హస్తం నేతల వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. పార్టీ లోకల్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సీనియర్ నేత ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిందట పరిస్థితి. ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నది కేడర్ మాట. ఇప్పటికే ఆర్మూర్ కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోగా… పాత- కొత్త పంచాయితీ రావణకాష్టంలా రగులుతూనే ఉందని అంటున్నారు. వినయ్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరి ఆర్మూర్ అభ్యర్ధిగా 2023 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓడిపోయాక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. ఐతే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఏబీ చిన్నాతో ఆయనకు గ్యాప్ వచ్చింది. అది కాస్తా… మున్సిపల్ ఎన్నికల నాటికి మరింత పెరిగి పార్టీకే ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు కార్యకర్తలు. అక్కడితో ఆగని ఈ పంచాయితీ….. గాంధీభవన్ వరకు చేరిందట. సరే… జరిగిందేదో జరిగిపోయింది, మున్సిపల్ ఎన్నికల తర్వాత మేటర్ ముగిసిపోతుందని అంతా భావించినా… అలాంటిదేం జరక్కపోగా… కథ మళ్లీ మొదటికి వచ్చిందట. వినయ్ రెడ్డి , చిన్నా ఇద్దరూ… పరస్పరం ఫిర్యాదులతో హోరెత్తించడం పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారుతున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కల్పించుకుని ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చారు. ఐతే… అప్పుడు వినయ్ వర్గం అభ్యర్ధుల ఓటమికి చిన్నా వర్గం పనిచేసిందని వాళ్ళు ఆరోపించారు.
అదే సమయంలో ఆర్మూర్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన చిన్నా భార్య ఓటమి కోసం వినయ్ వర్గం పనిచేసిందని వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ విధంగా అపనమ్మకాలతో ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వుతూ కత్తులు దూసుకుంటున్నారట. ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి వినయ్ రెడ్డిని తప్పించాలని చిన్నా వర్గం పట్టుబడుతున్నట్టు తెలిసింది. అసలు చిన్నాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వినయ్ వర్గం ఫిర్యాదులు సిద్దం చేస్తున్నట్టు తెలిసింది. ఇలా ఎవరికి వారే పరస్పరం ఫిర్యాదులతో మోత మోగిస్తున్నారు. మరోవైపు ఈ ఇద్దరు నేతలు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు సన్నిహితులన్న పేరుంది. వినయ్రెడ్డి బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చేయడం ఏంటన్నది చిన్నా వర్గం అభ్యంతరం. దీన్ని వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు పార్టీ పటిష్టం కోసం పనిచేసున్న వినయ్ రెడ్డికి ఏదో ఒక ముద్రవేసి చిన్నా పదేపదే అడ్డుతగలడం ఏంటన్నది ఇంకొందరి క్వశ్చన్. నేతల మధ్య పీక్స్కు చేరిన ఈ వర్గపోరు.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న భయం పార్టీ వర్గాలను వెంటాడుతోంది.
ఒకరికి అనుకూలంగా ఉంటే మరొకరు కన్నెర్ర చేస్తుండటంతో క్యాడర్ కూడా గందరగోళంలో పడుతోంది. ఎవరితో ఉండాలో తెలియక పార్టీ శ్రేణులు సతమతం అవుతున్నాయట. సందట్లో సడేమియాలా ఇద్దరి మధ్య వర్గపోరుతో మరో నేత ఈ నియోజకవర్గం పై కన్నేసినట్టు తెలుస్తంది. వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే చాపకింద నీరులా పని చేసుకుని పోతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పేరున్న డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లురుతున్నారట. కుదిరితే ఆర్మూర్ లేకుంటే బాల్కొండ అంటూ ఆర్మూర్ కేంద్రంగా రాజకీయం చేయాలన్న సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్ రాజకీయ రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పి అవుతుండగా… మరో నాయకుడు ఆ నియోజకవర్గంపై కన్నేయడం ఎటువైపుకు దారితీస్తుందోనన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీలో. వర్గపోరుతో సతమతం అవుతున్న పార్టీ శ్రేణులు మానాల ఎంట్రీతో ఎటువైపు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది.