Reading Time: < 1 minute
“నేను నిజంగా పెద్ద తప్పు చేశా.. వాళ్లు పిల్లి, కుక్కల్లా కొట్టుకుంటున్నారు”.. ట్రంప్  సంచలన వ్యాఖ్యలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్‌తో రెండో విడత చర్చలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ అగ్రనాయకత్వం మధ్య ఐక్యత లేదని, దేశాన్ని ఎవరు నియంత్రించాలనే అంశంపై వారు “పిల్లి, కుక్కల్లా” కొట్టుకుంటున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు.

మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ ఆర్థిక పరిస్థితిని అమెరికా పూర్తిగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధి వ్యవహారంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించిందని, కానీ తాను మాత్రం అందుకు నిరాకరించానని చెప్పారు. “జలసంధిని తెరిస్తే ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. ఒక ఒప్పందం కుదిరే వరకు వారికి ఆ అవకాశం ఇవ్వడం నాకు ఇష్టం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకపోతే టెహ్రాన్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తూనే, చర్చలు తన నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపారు.

ట్రంప్ వాదనలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశ నాయకత్వంలో చీలిక ఉందన్న వార్తలు కేవలం అమెరికా సృష్టించిన ఊహాగానాలేనని కొట్టిపారేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖీ మాట్లాడుతూ, తమ దేశం నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో స్పష్టతతో ఉందని తెలిపారు. అదేవిధంగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. “ఇరాన్‌లో తీవ్రవాదులు, మితవాదులు అని ఎవరూ లేరు. మనమందరం ఇరానీయులం, విప్లవకారులం. ఒకే దేవుడు, ఒకే దేశం, ఒకే నాయకుడి నాయకత్వంలో మేమంతా ఐక్యంగా ఉన్నాం.” అని పేర్కొన్నారు. సర్వోన్నత నాయకుడి ఆదేశాలను పాటిస్తూ, దేశంపై దాడికి పాల్పడే శక్తులు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.

మొత్తానికి, ట్రంప్ దూకుడు వైఖరి, ఇరాన్ మొండితనం వెరసి పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఇరు దేశాల మధ్య ఈ ‘మైండ్ గేమ్’ ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..