Reading Time: 2 minutes
West Bengal Election Violence Erupts During First Phase Polling

West Bengal Elections: వెస్ట్ బెంగాల్‌ ఎన్నికల్లో హింస కామన్‌గా మారిపోయింది. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో మరోసారి హింస చెలరేగింది. మొదటి దశ పోలింగ్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలివస్తుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన దహనకాండ, హింస, విధ్వంస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముర్షిదాబాద్ , కూచ్ బెహార్, సిలిగురి మరియుమాల్దాలో తీవ్ర అశాంతి నెలకొంది. ముర్షిదాబాద్‌లో అల్లరిమూకలు కర్రలు, ఇటుకలతో హుమాయున్ కబీర్ కారుపై దాడి చేశాయి. ముర్షిదాబాద్‌లోని నవోడాలో ఏజేయూపీ అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ కాన్వాయ్‌పై దుండగులు ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. టీఎంసీ, ఏజేయూపీ కార్యకర్తల మధ్య రక్తపాత ఘర్షణ జరిగింది. కబీర్ పోలీసు అధికారులతోనూ స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ దాడిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని అభ్యర్థి కబీర్ డిమాండ్ చేశారు.

మరోవైపు.. ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూచ్ బెహార్‌లోని తుఫాన్‌గంజ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అక్కడ సైతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భారీగా మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF) సిబ్బంది రంగంలోకి దిగారు. భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కొందరు సంఘ విద్రోహ శక్తులు ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది బలప్రయోగం చేయాల్సి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక, దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుమార్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ కలవరపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతుదారులు దాడి చేశారు. ఓ బూత్ వద్ద బూత్ జామింగ్ జరుగుతోందని బీజేపీ సర్కార్‌కు తెలిపినట్లు సమాచారం. ఆయన తన బృందంతో అక్కడికి చేరుకోగా.. ముందుగానే సిద్ధంగా ఉన్న టీఎంసీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులతో అభ్యర్థిపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే టీఎంసీ గూండాలు తనను కొట్టారని సర్కార్ ఆరోపించారు.

మాల్దాలోని మోతాబరి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బలుచారా హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓ ఈవీఎం పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల సంఘం అధికారి రాకలో జాప్యం జరగడంతో ఆగ్రహించిన ఓటర్లు, ఆ అధికారిని చుట్టుముట్టి బందీగా పట్టుకున్నారు. పలువురు ఓటర్లు ఆ అధికారి చేయి పట్టుకుని లాగుతూ, పెనుగులాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇక.. మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో గందరగోళం చెలరేగింది. ఈ వివాదం ముదిరి, మాజీ రాష్ట్ర మంత్రి తాజ్‌ముల్ హుస్సేన్ స్వగ్రామమైన బాంగ్రువాలోని (బూత్ నెం. 200, 201) టీఎంసీ ఎన్నికల శిబిర కార్యాలయాన్ని ధ్వంసం చేసే స్థాయికి చేరింది.

సిలిగురి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్, టీఎంసీ మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ పోలింగ్ కేంద్రం వెలుపల ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, కేంద్ర బలగాలు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో కేవలం సిలిగురిలోనే కాకుండా ముర్షిదాబాద్, మాల్దా వంటి ప్రాంతాల్లో కూడా చెదురుమదురు హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ముర్షిదాబాద్‌లో క్రూడ్ బాంబు దాడులు జరిగినట్లు సమాచారం అందగా, కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. తొలి విడత పోలింగ్ జరుగుతున్న ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైరం పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలకు కారణమవుతోంది.